mt_logo

బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం: మంత్రి కేటీఆర్

  • అసెంబ్లీ ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్
  • తొలి విడత 54 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీల జాబితాను విడుదల చేసిన బీఆర్ఎస్ 
  • పది సంవత్సరాల పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం అయ్యేలా పార్టీ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించిన కేటీఆర్

భారత రాష్ట్ర సమితి ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల తొలి విడత జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకుగాను పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీల ఇన్చార్జిలుగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. పార్టీ ఇన్చార్జిలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వీరికి దిశా నిర్దేశం చేశారు. 

సీఎం నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈరోజు పార్టీ నియమించిన అసెంబ్లీల ఇన్చార్జిలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ పైన పార్టీ ఇంచార్జీలకు దిశానిర్దేశం చేశారు. 

అభివృద్ధి, సంక్షేమాలు విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు 

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు.

గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ రోజు అసెంబ్లీల వారీగా ఇన్చార్జిలుగా నియమించిన ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటి నుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణను, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత వీరి పైననే ఉంటుందని, రేపటి నుంచి ఎన్నికలు ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను వీరు తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు అన్నింటిని సమన్వయం చేసుకొని పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. 

సమగ్ర ప్రణాళిక పకడ్బందీగా.. 

ఈ టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పార్టీ ఇంచార్జ్ లకు పలు సలహాలు, సూచనలు అందించారు. రానున్న 45 రోజుల పాటు నియోజకవర్గంలోనే  ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. ఇంచార్జీలుగా కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు బాధ్యత అప్పజెప్పిన కార్యక్షేత్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోవాలని సూచించారు . ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపిన హరీష్ రావు ఆ దిశగా ఈ 45 రోజుల పాటు విస్తృతంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు.