mt_logo

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో – 2023

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నం అన్నారు. వెనుకబడేయబడ్డ తెలంగాణ బాగుండాలంటే సంపద పెంచాలె – ప్రజలకు పంచాలె అని నిర్ణయించుకున్నం అని తెలిపారు. బడ్జెట్ ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకపోయినం అన్నారు. 

జీఎస్డీపీ రెండున్నర రెట్లు పెంచినం. తలసరి ఆదాయం పెంచినం. సంక్షేమానికి – అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చినం. సంక్షేమంలోనూ, క్యాపిటల్ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 

-బెస్ట్ ఎకనమిక్ పాలసీ 

-బెస్ట్ పవర్ పాలసీ

-బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ

-బెస్ట్ ఇరిగేషన్ పాలసీ

-బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ

-బెస్ట్ దళిత్ పాలసీ

-బెస్ట్ వెల్ఫేర్ పాలసీ

-బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ

-బెస్ట్ హెల్త్ పాలసీ

-బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ

-బెస్ట్ హౌసింగ్ పాలసీ

విజయవంతంగా అమలవుతున్న ఈ పాలసీలన్నీ యధావిధిగా కొనసాగిస్తం. కాలానుగుణంగా  ఉద్దీపనలిస్తూ, ఉన్నతీకరించుకుంటం అని స్పష్టం చేశారు. ఈరోజు బీఆర్ఎస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కొన్ని కొత్త హామీలు ప్రకటిస్తున్నం అన్నారు. 

అందరికీ సన్నబియ్యం : 

తెలంగాణ రాంగనే రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించవద్దని రేషన్ బియ్యం కోటాను  పెంచుకున్నం. పేదలు సంతోషపడ్డరని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాం అన్నారు. 

కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా : 

రాష్ట్రంలో తెల్లకార్డు కలిగిఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. వందశాతం ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తాం అన్నారు. తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ బలోపేతానికి దోహదపడతాం అని పేర్కొన్నారు.  

ఆసరా పెన్షన్ల పెంపు : 

విధివంచితులైన అన్నార్తులను, దీనార్తులను, అసహాయులను ఆదుకోవడం సామాజిక బాధ్యత అని తెలిపారు. అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర దేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు ఇస్తరు.  భారతదేశంలో పేదలకిచ్చే పెన్షన్లు ఒక జోక్ లాగా ఉండె. ఎడమ చేత్తోటి విదిలించినట్లు నామమాత్రంగా 20 – 70 రూపాయలు ఇచ్చేది. గరిష్టంగా  200 ఇచ్చిన్రు అని తేల్చి చెప్పారు. అవి కూటికి రాకపోవు, గుడ్డకు రాకపోవు. పేదల పట్ల గౌరవంతో పింఛన్లను వేల రూపాయలకు తీసుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఇవాళ నేను రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల లబ్దిదారులందరికీ ఒక తీపికబురు చెబుతున్నా.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపారు. 

ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకపోతమని హామీ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఇచ్చుకుంటన్నది. 2,016 రూపాయలు,మొదటి సంవత్సరం వెయ్యి పెంచుతం – అంటే 3,016 రూపాయలకు పెంచుకుంటం. ఐదు సంవత్సరాలల్ల 5 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తున్న అన్నారు. దివ్యాంగుల పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచినం అని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో  6,016 రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తున్నాం.  దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద భారం ఒకేసారి పడదు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత, బాధ్యతతోని మా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీలిస్తున్నాం అని పేర్కొన్నారు. 

రైతుబంధు సాయం పెంపు : 

దేశంలో రైతులకు పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం చేయాలనే ఆలోచన ఎవ్వరు చేయలేదు. రైతుబంధు సృష్టికర్తనే బీఆర్ఎస్ అన్నారు. ఈ పథకం ఎన్నికల వాగ్దానం కాదు – మ్యానిఫెస్టోలో పెట్టింది కాదు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలెనని ఆలోచించి, నిబద్ధతతో, నిజాయితీతో రైతుబంధు పథకం తెచ్చినం అని తెలిపారు.  కనుక, పెట్టింది మేమే – పెంచేది మేమే అన్నారు. ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం – ఎకరానికి ఏటా 10,000 రూపాయలు, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇస్తున్న.వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతం అని హామీ ఇస్తున్నాం, ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తాం అన్నారు. 

అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి : 

బీఆర్ఎస్ మొదటి నుంచీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. చాలా పథకాల ప్రయోజనాలు మహిళల పేర్లమీదనే అందిస్తున్నది. ఇవాళ మానవీయమైన మరో మంచి పథకాన్ని హామీ ఇస్తున్నాం. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతి నెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తుందని హామీ ఇస్తున్నాం అని పేర్కొన్నారు.  

400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం : 

కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచి, సామాన్యుల మీద మోయలేని భారం వేస్తున్నది. ఈ భారం తప్పించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో బీఆర్ఎస్ మానవీయ కోణంతో మరో హామీని ప్రకటిస్తున్నది.  బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండరును అందిస్తుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నాం అన్నారు. 

ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు : 

బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధికశాతం ప్రజలకు మునుపటికన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్నది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా  ఉంది. బీఆర్ఎస్  మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతుందని హామీ ఇస్తున్నాం అని పేర్కొన్నారు. 

పేదలకు ఇండ్ల స్థలాలు : 

రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు. 

అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు : 

తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యకు పెద్దపీట వేస్తున్నది. ఈ విధానం సత్ఫలితాలను సాధిస్తున్నది. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం.అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. 

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు : 

రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. 

ఉద్యోగుల సీ.పీ.ఎస్.పై అధ్యయన కమిటీ : 

 సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం – నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. 

అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ

• ASSIGNED LANDS WILL BE FREE FROM HOLD
• MINORITY WELFARE WILL BE INCREASED