mt_logo

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా రేవంత్ రెడ్డి మారారు: బాల్క సుమన్

తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పది నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారు అని మండిపడ్డారు.

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా రేవంత్ రెడ్డి మారారు. రేవంత్ రెడ్డి మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో సభ ఏర్పాటు చేశారు. యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించారు అని గుర్తు చేశారు.

ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది..18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు ఎలెక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. గ్రూప్ 1 నియామకాలు ఏప్రిల్ 2024లో చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అని అన్నారు.

నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అని యువతను నమ్మించి మోసం చేశారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీఆర్ఎస్ చెప్పింది. మేము అధికారంలో ఉన్నప్పుడు 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాము..ప్రైవేట్ రంగంలో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు బిఆర్ఎస్ హయాంలో వచ్చాయి. 2.27 లక్షల ఉద్యోగాలకు బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చాము అని తెలిపారు.

దయ్యాలు సీఎం మాటలు విని సిగ్గుపడతాయి.. టీచర్ ఉద్యోగాలకు మేము 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 ఉద్యోగాలు యాడ్ చేసింది. ఆరు గ్యారెంటీలు, 13 హామీలను అమలు చేయడం లేదు అని సుమన్ విమర్శించారు.

రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని అన్నారు. రైతులందరికి రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారు అని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటెన్షన్ డైవర్షన్ చేస్తోంది.. నిరుద్యోగుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టింది. మూటలు సర్దుకుని ఢిల్లీకి మూటలు పంపడంపై రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అభయహస్తం నిరుద్యోగుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది అని పేర్కొన్నారు.

నిరుద్యోగులను ముఖ్యమంత్రి ఎందుకు కలవడం లేదు.. ఒక్క మంత్రి అయినా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా.. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల చుట్టూ తిరిగారు. రాష్ట్రం అంతా నిరుద్యోగ యాత్రలు చేయించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు