mt_logo

అకాల వ‌ర్షంతో పంట న‌ష్ట‌పోయిన రైతుల ఖాతాల్లోకి 304 కోట్లు

తెలంగాణ అంటేనే దేశంలో అంద‌రికీ గుర్తొచ్చేది కిసాన్ స‌ర్కార్. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌గానే సీఎం కేసీఆర్ అత్య‌ధిక మంది రైతులు ఆధార‌ప‌డ్డ వ్య‌వ‌సాయ‌రంగంపైనే దృష్టిపెట్టారు. ప్ర‌పంచ‌మే అబ్బుర‌ప‌డేలా కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి, గోదార‌మ్మ‌ను ఎదురెక్కించారు. రాష్ట్రంలోని ప్ర‌తి ఎక‌రాకు నీళ్లందించారు. రైతుబంధు, రైతు బీమా, వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రెంటు, స‌కాలంలో ఎరువులు అందించి వ్య‌వ‌సాయాన్ని పండుగ‌లా చేశారు. తెలంగాణ‌ను దేశానికే బువ్వ‌గిన్నెలా మార్చేశారు.  కేంద్రం మొండికేసినా తెలంగాణ‌లో పండిన ప్ర‌తి గింజా కొని, అన్న‌దాత‌కు అండ‌గా నిలిచారు. తాజాగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకొని త‌మ‌ది కిసాన్ స‌ర్కార్ అని నిరూపించారు. 

సీఎం కేసీఆర్ మాట‌పై నిల‌బ‌డ్డారు. ఆయ‌న ఇచ్చిన హామీ మేర‌కు నష్టపోయిన పంటలకు ప‌రిహారంగా  రూ.304.61 కోట్లను తెలంగాణ స‌ర్కారు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 27 వరకు రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు రైతులకు దూరం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. దీంతోపాటు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి ఆ రైతులకు పరిహారాన్ని అందించాలని ఆదేశించారు.

2.79 ల‌క్ష‌ల మంది రైతుల‌కు సాయం

పంటనష్టంపై సర్వే చేసిన వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 2.79 లక్షల మంది రైతులకు సంబంధించిన 3.04 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. దీనికి అనుగుణంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.304.61 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ పరిహారం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంతకు ముందు మార్చి 17 నుంచి 21 వరకు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది రైతులకు చెందిన 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇప్పటికే రూ.151.64 కోట్ల పరిహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ విధంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రెండు విడతల్లో కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ తేల్చింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం రూ.456.25 కోట్ల నష్ట పరిహారాన్ని విడుదల చేసి అన్నదాతలను ఆదుకొంటున్నది.