mt_logo

జీవో 58,59 ల ప్రకారం నోటరీ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి మరో నెల రోజులపాటు గడువు

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను  కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీవో 58,59 ల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి మరో నెల రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ప్రజల ను సీఎం కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిల్లోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలన్నారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు. 

ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు.  అదే సందర్భంలో.. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సిఎం అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నామని తెలిపారు.