Mission Telangana

తెలంగాణలోని యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని యూనివర్సిటీలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల పాలనా వ్యవస్థను తీర్చిదిద్దాలని, రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా విశ్వవిద్యాలయ చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాలకు ఒకే వ్యక్తి వైస్ ఛాన్సలర్ గా ఉంటే వాటి పర్యవేక్షణ కష్టమవుతోందని, వీసీ నియామక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పారు. వీసీలు, రిజిస్ట్రార్ల నియామకాల మార్గదర్శకాలు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్ గా ఆచార్య యాదయ్యను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలాఉండగా అంతకుముందు బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకకు సీఎం దంపతులతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, హోంమంత్రి నాయిని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *