mt_logo

తిట్టు రాజకీయాలు..

By: కట్టా శేఖర్ రెడ్డి

విచిత్రం ఏమంటే ఐదేండ్లు పరిపాలించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందరూ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంపైనే ఆధారపడటం. పాలనలో విఫలమైనప్పుడు, చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడే ఇటువంటి దుస్థితి రాజకీయ నాయకులకు వస్తుంది. మోదీ తానేం చేశారో చెప్పడం కంటే ఇటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పైన, ఆంధ్ర సీఎం చంద్రబాబు పైన విమర్శలు గుప్పించడంపైనే దృష్టి పెట్టారు. ఐదేండ్ల కింద చంద్రబాబును వెనుకేసుకొని తిరుగడంతోపాటు రాష్ట్ర విభజనను ఎగతాళి చేసిన మోదీ ఇప్పుడు అదే చంద్రబాబుపై సూర్యోదయం, పుత్రోదయం గురించి మాట్లాడుతున్నారు. దేశంలో మతమౌఢ్యాన్ని, గోరక్షణ పేరిట హింసాకాండను, అడ్డగోలుగా మాట్లాడే సన్యాసులను యథేచ్ఛగా చెలరేగడానికి అవకాశం ఇచ్చిన మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ జీవన విధానాన్ని, విశ్వాసాలను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అవకాశవాదంలో నరేంద్ర మోదీ ఎవరికీ తీసిపోరనడానికి ఇది నిదర్శనం. కేసీఆర్ మంచిపాలన అందిస్తున్నారని, ఆయన పథకాలు బాగున్నాయని, కేంద్రంతో పేచీలు పడకుండా తన రాష్ట్రం పని తాను చేసుకుపోతుంటారని ఇన్నాళ్లు పొగిడిన నోటితోనే ఇప్పుడు జాతకాలు, జ్యోతిష్యాలను గురించి విమర్శిస్తున్నారు. అంటే మోదీ రాజకీయాలకు ఉపయోపడే మతమే మతంకానీ, పౌరులు ఆచరించే మతం మతం కాదు. ఆయనకు ఓటేసే వారే హిందువులు కానీ, మతాన్ని ఒక జీవన విధానంగా స్వీకరించి సాగిపోయేవారు ఆయన దృష్టిలో హిందువులు కాదు. ఓట్లకు మతానికి బంధం పెట్టిన బీజేపీ హిందువుల ప్రతినిధి కాదు. ఓటు రాజకీయాలకు ప్రతినిధి మాత్రమే. దేశంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి, హిందువులను పోగేసి, ఒక బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకొని, క్రమంగా దీన్ని హిట్లర్ నాటి జర్మనీగా మార్చే దీర్ఘకాలిక వ్యూహం ఆయనలో కనిపిస్తున్నది.

అదృష్టం ఏమంటే తెలంగాణలో తెలుగుదేశం అంతరించడం. చంద్రబాబునాయుడు రొచ్చు రాజకీయాలు వినాల్సిన, పడాల్సిన అగత్యం తెలంగాణకు తప్పిపోవడం గొప్ప మార్పు. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుతమైన విజయం. తెలంగాణపై ఆధిపత్యపు రాజకీయాలకు ప్రతీక తెలుగుదేశం. ఆధిపత్య ఆఖరి అవశేషాలూ అంతరించిపోవడం శుభపరిణామం. ఇక తెలంగాణ కొట్లాడాల్సింది ఢిల్లీ గులాములపైన. జాతీయ రాజకీయపార్టీల చెప్పుచేతల్లో ఉంటూ తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టే శక్తులపైన. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవలసింది ఒక్కటే. తెలంగాణ రాష్ట్రం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ 2004లోనే హామీ ఇచ్చింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో కూడా ప్రకటించింది. రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారు. అయినా 2014 దాకా రాష్ట్రం ఎందుకు రాలేదు?

బీజేపీ సీనియర్ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఈ ఎన్నికలే చివరి ఎన్నికలని ఒకాయన చెబితే, త్వరలోనే అఖండ భారత్ చూస్తారని మరొకాయన అంటారు. హిందూ దేశం, అఖండ భారతం వంటి నినాదాలు వినడానికి, చూడటానికి బాగుంటా యి. కానీ వాటిని సాధించే ప్రయాణంలో జరిగే మానవ విధ్వంసం, అందులో అన్ని మతాల ప్రజలు సమిధలయ్యే పరిస్థితి ఎవరూ ఊహించడం లేదు. నరేంద్రమోదీ చెప్పినవి ఏ ఒక్కటీ జరుగలేదు. డీమోనెటైజేషన్ ఘోరంగా విఫలమైంది. ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఎప్పటిలాగే శిఖరాలు ఎగబాకుతున్నది. నల్లధనం విశ్వరూపం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నది. ఆర్థిక నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అవినీతి ఆరోపణలు మిన్నంటుతున్నా యి. ఎప్పటిలాగే తెలంగాణ అనేక పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత, ఆ పథకాలను అనేక రాష్ట్రాలను అనుకరించి అమలు చేసిన తర్వాత, అదే పథకాన్ని పిప్పరమెంట్ల పథకం కిందకు దిగజార్చి జాతీయస్థాయిలో కిసాన్ యోజన అని ప్రవేశపెట్టారు. అయినా ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయి. అందుకే ఆయన ఎంత చిన్న విజయం వచ్చినా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని రూపొందించే మిషన్ శక్తి ప్రాజెక్టును ఎప్పుడో పదిహేనేండ్ల కిందట ప్రారంభించారు. 2012లోనే ప్రాథమిక పరీక్షలు జరిగాయి. ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్‌కు అప్పుడే పేరొచ్చింది. మొన్న జరిగింది నిజమైన ఉపగ్రహాన్ని కూల్చివేసే పరీక్ష మాత్రమే. అది దేశానికి గొప్ప విజయమని చెప్పడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ దానికిముందు చరిత్ర ఏమీ చెప్పకుండా అంతా తానే చేసినట్టు దేశం మొత్తాన్ని అటెన్షన్‌లోకి తీసుకొని, జాతినుద్దేశించి ప్రసంగించడం చూస్తేనే ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

చంద్రబాబునాయుడిది అయితే పిచ్చి పీక్‌కు చేరుతున్నది. హిరణ్యకశపుడికి నిత్యం శ్రీమహావిష్ణువు కలలోకి వచ్చి సొంత కుమారుడు ప్రహ్లాదుడిని వేధించినట్టు, చంద్రబాబునాయుడు రోజూ కొన్ని వందలసార్లు కేసీఆర్ పేరు తలుచుకొని ఉన్నవి లేనివి చెప్పి ఆంధ్ర ప్రజలకు అసాధారణ శిరోవేదన కలిగిస్తున్నారు. కేసీఆర్ ఆంధ్రలో పోటీ చేయడం లేదు. అక్కడి రాజకీయాలను పట్టించుకోవడం లేదు. అయినా చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టాలని నోటికి ఎంత మాటవస్తే అంతమాట మాట్లాడేస్తున్నాడు. గమనించారో లేదో… చంద్రబాబు ఎంత గొంతు చించుకుంటున్నా ప్రజల నుంచి స్పందన లేదు. జగన్ లక్ష కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని చెప్పిన నోటితోనే జగన్‌కు కేసీఆర్ వెయ్యికోట్లు పంపించాడని చెబితే ఇక ఆ మనిషిని ఏమనుకోవాలి? లక్ష కోట్లు సంపాదించిన జగన్‌కు కేసీఆర్ నుంచి వెయ్యి కోట్లు అవసరమేమిటి? చంద్రబాబు మాటల్లో ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. లాజిక్ ఉండదు. విచక్షణ ఉండదు. మెదడులో జనించిన బురదనంతా కుమ్మరించడం ఒక్కటే ఆయనకు తెలిసిన విద్య. ఆయన దర్శకత్వంలోనే పనిచేస్తున్న జనసేన నేత పవన్‌కల్యాణ్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. కేఏ పాల్‌దీ అదే ధోరణి. చంద్రబాబునాయుడిని చూడండి.. అధికారం పోతుందంటే ఎంతకైనా తెగిస్తాడు. ఏ స్థాయికైనా దిగజారుతాడు. పవన్‌కల్యాణ్, మనం వేర్వేరు కాదు, కలిసే ఉన్నాం అని విశాఖకు ఎన్నికల పరిశీలకునిగా వెళ్లినాయన పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పేశారు. ఆ వీడియో బయటికివచ్చింది. అంతే.. మళ్లీ ఇద్దరూ పరస్పరం తిట్టుకోవడం మొదలుపెట్టారు. పవన్‌కల్యాణ్ పూర్తిగా బలహీనపడకూడదు. అట్లాగని బలమైన పోటీ కాకూడదు. పవన్‌కల్యాణ్ పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని చంద్రబాబు ఆశ. పవన్‌కల్యాణ్ కొత్తలో ఉన్నట్టు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కొంత చీల్చేవాడేమో.

పవన్‌తో పొత్తుకు చర్చలు జరుగుతున్నాయని, ఆయన ఇన్ని సీట్లు అడుగుతున్నాడు, ఇన్ని కోట్లు అడుగుతున్నాడని ప్రచారం చేసి, చంద్రబాబునాయుడే పవన్‌కల్యాణ్ రాజకీయ బెలూన్ గాలిని కొంత తీసేశారు. రానురాను పవన్‌కల్యాణ్ చంద్రబాబు బీ టీమ్‌గా ముద్ర స్థిరపడిపోయింది. ఇప్పుడు వీడియోలు కూడా బయటికి రావడంతో మరింత స్పష్టత వచ్చింది. అందుకే మళ్లీ ఇద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. పోలింగ్‌కు రెండు మూడు రోజులు ముందు దాకా ఇలా. ఆ తర్వాత మళ్లీ అందరి టార్గెట్ జగన్. చంద్రబాబునాయుడు రాజకీయ కుప్పిగంతులు జనానికి అర్థం కావా? చంద్రబాబునాయుడు మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ పాల్పడనంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. అన్ని వ్యవస్థలనూ అడ్డగోలుగా తన సొంత రాజకీయ ఎన్నికల ఎజెండా కోసం వాడుకుంటున్నాడు. హైకోర్టు జోక్యం కారణంగా ఆయన స్వారీకి కళ్లెం పడింది కానీ లేకపోతే ఆయన ఇంకా చెలరేగిపోయేవాడు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు, జగన్‌కు ఇద్దరికీ జీవన్మరణ సమస్య. అందుకే వారు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అదృష్టం ఏమంటే తెలంగాణలో తెలుగుదేశం అంతరించడం. చంద్రబాబునాయుడు రొచ్చు రాజకీయాలు వినాల్సిన పడాల్సిన అగత్యం తెలంగాణకు తప్పిపోవడం గొప్ప మార్పు. ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుతమైన విజయం. తెలంగాణపై ఆధిపత్యపు రాజకీయాలకు ప్రతీక తెలుగుదేశం. ఆధిపత్య ఆఖరి అవశేషాలూ అంతరించిపోవడం శుభపరిణామం. ఇక తెలంగాణ కొట్లాడాల్సింది ఢిల్లీ గులాములపైన. జాతీయ రాజకీయపార్టీల చెప్పుచేతల్లో ఉంటూ తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టే శక్తులపైన. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవలసింది ఒక్కటే. తెలంగాణ రాష్ట్రం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ 2004లోనే హామీ ఇచ్చింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో కూడా ప్రకటించింది.

రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారు. అయినా 2014 దాకా రాష్ట్రం ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే జాతీయపార్టీల దోబూచులాటల కారణంగా. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క కట్టున 2004లోనో 2005లోనో వీధిపోరాటాలకు దిగి ఉంటే తెలంగాణ తొమ్మిదేండ్ల పాటు ఇంత క్షోభ అనుభవించేదా? ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేదా? బీజేపీ ఇవ్వాళ చాలాచాలా మాట్లాడుతున్నది. 1998లోనే కాకినాడ తీర్మానం చేసిన బీజేపీ కేంద్రంలో ఆరేండ్లు అధికారంలో ఉంది. కానీ తెలంగాణ ఎందుకివ్వలేదు? ఎందుకివ్వలేదంటే వారికి జాతీయ రాజకీయాలు అడ్డొచ్చాయి. వెంకయ్య, చంద్రబాబులతో వారికి పని ఉంది కాబట్టి, వారు చెప్పినట్టు విని ఆంధ్ర-తెలంగాణ బీజేపీ నాయకత్వం నోర్మూసుకొని ఉంది కాబట్టి అప్పుడు సాధ్యం కాలేదు. అప్పుడైనా, ఆ తర్వాతైనా నిరంతరం తెలంగాణ జెండాను మీదేసుకొని పోరాడింది ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే. పదేండ్ల పాటు నానాయాతన పడి దేశవ్యాప్తంగా ఒక రాజకీయ ఏకాభిప్రాయాన్ని సాధించి, అనివార్యతను సృష్టించిన తర్వాతనే తెలంగాణను తెచ్చుకోగలిగాం. రాష్ట్ర రాజకీయ చిత్రపటం నుంచి టీఆర్‌ఎస్‌ను తీసేసి చూడండి మన పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతుంది. అందుకే మన సమస్యల కోసం మనమే కొట్లాడాలి. ఎవరితో మొహమాటం లేని మన నాయకులు మనకు ఉంటేనే ఏ సమస్యనైనా పరిష్కరించుకుంటాం. ఇప్పుడూ అంతే జాతీయపార్టీలలో సమాఖ్య స్ఫూర్తి లేదు. రాష్ట్రాల బాగోగులు పట్టవు. వారి ఎజెండాలు వారివి. మన బాగు మనమే చూసుకోవాలి. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ బాధ ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీల బాధ కాదు, ఢిల్లీ బాధ కాదు..

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *