mt_logo

దేశానికిపుడు కేసీఆర్ చాలా అవసరం : యశ్వంత్‌ సిన్హా

ఎంతో ముందు చూపు కలిగిన కేసీఆర్ లాంటి నేత ఇపుడు దేశానికి చాలా అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకే ఒక్కడు కేసీఆర్‌ లోక్‌సభలో గళం విప్పారని చెప్పారు. ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమవుతానని వెల్లడించారు. హైదరాబాద్‌ జలవిహార్‌లో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిథుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ తనకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కేసీఆర్‌ సవివరంగా చెప్పారు. తెలంగాణలో ప్రజా చైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేము. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు చేసే పోరాటం భారత్‌ భవిష్యత్‌ కోసం కాదు. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసే పోరాటమిది’ అని యశ్వంత్‌ సిన్హా అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *