mt_logo

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు తేనెపూసిన కత్తి లాంటిది- కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారు. ఈ నూతన వ్యవసాయ బిల్లు తేనెపూసిన కత్తి లాంటిదని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలని సీఎం తేల్చిచెప్పారు. రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, రైతులను దెబ్బ తీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. పైకి మాత్రం రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్ళి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేట్ వ్యాపారులకు దారులు బార్లా చేయడానికి ఉపయోగపడే బిల్లులా ఉందని స్పష్టం చేశారు.

రైతులు తమ సరుకులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో వ్యయప్రయాసలతో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? అని సీఎం ప్రశ్నించారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతం తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నుల మక్కలు సేకరించింది. 35 శాతం సుంకం తగ్గించడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది? దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏంటి? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ బిల్లుపై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా ఆర్డినెన్సులు తెచ్చారని, లోక్ సభలో మెజార్టీ ఉందని బిల్లులు పాస్ చేశారని అన్నారు. బడా కంపెనీలకు మేలు చేసేలా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములను పెద్ద కంపెనీలకు అప్పగించేందుకే కొత్త బిల్లులను కేంద్రం తీసుకొస్తోంది. రైతాంగానికి నష్టం చేకూర్చేలా ఉన్న బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటాం. విదేశీ రైతులకు మేలు చేసేలా దిగుమతి సుంకం తగ్గించారని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *