టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చేనెల ఐదవ తేదీన తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సుమారు 2వేల వాహనాలతో ర్యాలీగా బయలుదేరి తుమ్మల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నేతలవరకూ అందరూ తుమ్మల వెంట నడిచేందుకు రెడీగా ఉన్నారు. దీంతో ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి.
తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరనుండటంతో ఖమ్మం జిల్లాలో టీడీపీ మొత్తం ఖాళీ అవనుంది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి చెందిన వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది.