ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ మహానాడు సభను పెడ్తే అక్కడి ప్రజలు తంతారనే హైదరాబాద్ లో పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు గతంలో హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. తాను, మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత ప్రజలు ఎన్నుకుంటేనే నాయకులమయ్యామన్నారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే శాశ్వతమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక మహావృక్షమని, ఆయన నాయకత్వంలో తామందరం ముందుకు పోతున్నామని, ఉద్యమ సమయంలో తెలంగాణలో ఆత్మహత్యలకు టీడీపీ ఎంత వరకు కారణమో, కాంగ్రెస్ కూడా అంతే కారణమని అన్నారు.
మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్దాలే తప్ప నిజం చెప్పడని, ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ తో పాటు తెలంగాణను తానీ అభివృద్ధి చేశానని బాబు చెప్తున్నాడని, అభివృద్ధిపై చర్చకు తాము ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమని, మరి చంద్రబాబు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. అమరవీరుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి, చంద్రబాబుకి లేదని జూపల్లి తేల్చిచెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని, హైదరాబాద్ లో ఉండి పాలన చేస్తుంటే ఇతర దేశాల్లో ఉండి చేస్తున్నట్లు ఉందని అన్న చంద్రబాబు ఇక్కడే ఎందుకు ఉంటున్నారని, తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణలో టీడీపీ ఆశలు నెరవేరవని జూపల్లి స్పష్టం చేశారు.