mt_logo

“ప్రతి అక్షరం ప్రజాద్రోహం” – చివరి భాగం

ప్రముఖ జర్నలిస్టు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ రాసిన “ప్రతి అక్షరం ప్రజాద్రోహం” పుస్తకం చివరి భాగం కింద చదవండి.

మొదటి భాగం ఇక్కడ చదవొచ్చు: http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part1/

రెండవ భాగం ఇక్కడ చదవొచ్చు: http://missiontelangana.com/nvenugopal-skc-rebuttal-part2/

***

తప్పుడు వాదనలు

పాఠకులను, పరిశీలకులను పక్కదారి పట్టించడానికి, తప్పుడు అవగాహనలు కల్పించడానికి, తెలంగాణ ప్రత్యర్థుల చేతికి ఆయుధాలు అందించడానికి కమిటీ అనేక తప్పుడు వాదనలను కూడ ముందుకు తెచ్చింది. వాటిలో కొన్ని ప్రధానమైన తప్పుడు వాదనల గురించి చూద్దాం.

ప్రభుత్వ గణాంకాలు

కమిటీ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల మీద మాత్రమే ఆధారపడింది. నిజానికి ఈ వివాదం తెలంగాణ వాదులకూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్యనే. తమకు అన్యాయం జరిగిందనీ, ఆ అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల వల్ల జరిగిందనీ తెలంగాణవాదులు అంటున్నారు. అంటే ఈ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేదే ఒక పక్షం. అలా తెలంగాణకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్యన వివాదాన్ని తీర్చడానికి మధ్యవర్తిగా వచ్చిన కమిటీ ఒక పక్షపు వాదనలను యథాతథంగా అంగీకరించి ప్రకటించడం సహజ న్యాయసూత్రాలకే విరుద్ధం. ఆ అంకెలు అబద్ధాలని, ఆ అంకెలను ఉత్పత్తి చేస్తున్న పక్షమే తమ మీద అన్యాయానికి, వివక్షకు కారణమని, ఆ అన్యాయాన్ని, వివక్షను మరుగు పరచడానికే ఆ అంకెలను తయారు చేస్తున్నదని మరొకపక్షం వాదిస్తున్నప్పుడు, మధ్యవర్తిగా ఉన్నవారు తటస్థమైన సమాచారాన్నయినా సేకరించాలి. ఒక పక్షం ఇచ్చిన సమాచారాన్ని మరో పక్షం ఇచ్చే సమాచారంతో పోల్చి చూడడమైనా చేయాలి. ఇది సహజ న్యాయసూత్రం. శ్రీకృష్ణ కమిటీ మాత్రం ఎక్కడా ఈ సహజ న్యాయ సూత్రాన్ని పాటించలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెపుతున్న గణాంకాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడైనా, స్పష్టంగా అబద్ధాలని అర్థమయ్యేట్టుగా ఉన్నప్పుడైనా కమిటీ వాటిని అనుమానించాలని, ప్రశ్నించాలని అనుకోలేదు. మొత్తంగా ప్రస్తావించిన అంకెలూ గణాంకాలూ అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినవే తప్ప, స్వతంత్ర పరిశోధకులవీ కాదు, జాతీయ సంస్థలవీ కాదు, తెలంగాణ వాదులవీ కాదు. ఎంత ఏకపక్షపు న్యాయమూర్తులయినా తమ తీర్పులలో ఇటువంటి పద్ధతి పాటించరు.

అసలు అంకెలు వాటికవిగా దేన్నీ ఆమోదించవు, దేన్నీ నిరాకరించవు. అంకెల మూలాన్ని బట్టి, ఎవరు సేకరించారనే దాన్ని బట్టి, ఎవరు చెపుతున్నారనే దాన్ని బట్టి, ఎంత భాగం చెపుతున్నారనే దాన్ని బట్టి, ఏ అంకెలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే దాన్ని బట్టి వాటికి రంగూ రుచీ వాసనా వస్తాయి. వాటికి చరిత్ర ఉంటుంది, వాటి వెనుక మనుషులు ఉంటారు. వాటి వెనుక చూపదలచుకున్న మనుషులూ ఉంటారు, దాచిపెట్టదలఛుకున్న మనుషులూ ఉంటారు. ఈ సంక్లిష్టతను పట్టించుకోకుండా, గుర్తించకుండా అంకెలను నిరపేక్షమైనవిగా, నిష్పక్షపాతమైనవిగా చూడడం అమాయకత్వమైనా అవుతుంది. లేదా కుట్రలో భాగం కావడమైనా అవుతుంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ మహా మహా మేధావులతో తయారయింది గనుక ఇది అమాయకత్వం కావడానికి వీలు లేదు, కచ్చితంగా కుట్రే అయి ఉంటుంది.

వృద్ధి రేట్ల మాయాజాలం

“మొత్తంగా చూస్తే, మొత్తం నిధులు, అంకెలు, శాతాలు పరిశీలించినప్పుడు తెలంగాణవాదుల ఆరోపణలలో కొన్ని గాని, అన్నీ గాని నిజాల లాగనే అనిపిస్తాయి. కాని, మార్పు రేటు, పెరుగుదల రేటు, రాష్ట్ర ఆర్థికవ్యవస్థలో వాటాలు అంచనా కట్టి అధ్యయనం చేసినప్పుడు అసాధారణమైన స్థితి ఏమీ కనిపించదు” (పే. 117) అని కమిటీ రాసింది.

ఈ సమర్థన సాయంతో వృద్ధి రేట్లు అనే ఒక ఊతకర్రను సాయంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధి చెందిందనే అబద్ధాన్ని పదేపదే చెప్పడానికి కమిటీ ప్రయత్నించింది. నిజానికి గణాంకాలనేవే మాయ అయితే, వృద్ధి రేటు అనేది మరింత పెద్ద మాయాజాలం. వృద్ధి రేట్లను గురించి మాట్లాడేవాళ్లెవరయినా గుర్తించవలసిన విషయమేమంటే వృద్ధి రేటు అనేది రెండు వేరు వేరు అంకెలమధ్య, రెండు వేరు వేరు కాలాల మధ్య పోలికను చెపుతుంది. ఆ రెండు అంకెలనూ, కాలాలనూ విస్మరించి వృద్ధి రేటు గురించి మాట్లాడడానికి వీలులేదు. ఆ రెండు అంకెలలో మొదటి అంకె ఎంత చిన్నదిగా ఉంటే వృద్ధి రేటు అంత ఎక్కువగా ఉంటుంది. అర్థశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే దీన్ని ‘బేస్ ఎంత తక్కువగా ఉంటే గ్రోత్ రేట్ అంత ఎక్కువగా ఉంటుంది’ అంటారు. అందువల్ల వేరు వేరు బేస్ లతో జరిగిన వృద్ధి రేట్లను పోల్చడానికే వీలు లేదు. ఒకదాని బేస్ తక్కువగానూ, మరొకదాని బేస్ ఎక్కువగానూ ఉన్న రెండు ప్రాంతాల అంకెలను తీసుకుని వాటికి అదనంగా చేరినదానితో వృద్ధి రేటు లెక్కకట్టి పోలిస్తే తప్పుడు ఫలితాలే వస్తాయి. అప్పుడు రెండు ప్రాంతాలలో అదనంగా చేరినది సమానమే అయినా రెండిటి గ్రోత్ రేట్లు వేరువేరుగా ఉంటాయి.

ఉదాహరణకు ఒక బేస్ 1 గానూ, మరొక బేస్ 10గానూ ఉన్నప్పుడు రెండిటికీ సమానంగా చెరి ఒకటి కలిపితే ఒకటి రెండుగానూ, పది పదకొండుగానూ మారుతాయి. ఇక్కడ రెండు చోట్లా చేరినది సమానమే అయినా ఒకచోట అది 100 శాతం వృద్ధి రేటుగా, మరొకచోట 10 శాతం వృద్ధి రేటుగా ఉంటుంది.

అందువల్ల బేస్ తో సంబంధం లేకుండా వృద్ధిరేట్ల గురించి మాట్లాడడం అర్థరహితం. వృద్ధిరేట్ల గురించి మాట్లాడేటప్పుడు 1956లో తెలంగాణలో ఉన్న స్థితి ఏమిటో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్థితి ఏమిటో చెప్పి, ఆ తర్వాత యాభై ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పవలసి ఉంటుంది. ఆ అభివృద్ధికి కూడ ప్రభుత్వం వైపు నుంచి నిధుల కేటాయింపు రూపంలో జరిగిన దోహదం ఎంతో, వ్యక్తిగత స్థాయిలో జరిగిన దోహదం ఎంతో చెప్పవలసి ఉంటుంది. ఈ రకమైన పునాది గురించి వివరణ లేకుండా వృద్ధిరేట్ల గురించి మాట్లాడడం అంకెల గారడీ, ఆత్మవంచన, పరవంచన. ఈ పనులు చేయడంలో తనకు చాల నైపుణ్యం ఉన్నదని కమిటీ సమర్థంగా చూపుకుంది.

నీటి పారుదల వృద్ధిలో ప్రభుత్వం పాత్ర ఎంత?

నీటి పారుదల సౌకర్యాల గురించి, వాటి పెరుగుదల గురించి మాట్లాడేటప్పుడు కమిటీ చాల తెలివిగా అంకెలు గుప్పిస్తూ పోయింది ఆని ఆ అంకెలకు చరిత్ర ఉంటుందనీ, ఆ అంకెల వెనుక మనుషులూ, మనుషుల ప్రయత్నాలూ ఉంటాయనీ మరచిపోయింది. ఉదాహరణకు తెలంగాణలో కొన్ని జిల్లాలలో నీటి పారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణం పెరిగిందని మొత్తం అంకెను మాత్రం ప్రకటించింది గాని, ఆ పెరిగిన విస్తీర్ణంలో రైతులు వ్యక్తిగతంగా చేసుకున్న ప్రయత్నాల వాటా ఎంత, పన్నులుగా వసూలు చేసిన ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఎంత అనే విషయాన్ని దాటవేసింది.

నిజానికి నీటిపారుదల సౌకర్యాల కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, విధాననిర్ణయాల పరంగా తెలంగాణకు అన్యాయం చేసిందనేది, వివక్ష చూపిందనేది తెలంగాణ వాదుల వాదనలలోని ప్రధానాంశాలలో ఒకటి. దీనికి జవాబు చెప్పాలంటే 1956 తర్వాత ప్రజాధనంతో ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల, కాలువల కింద కొత్తగా తెలంగాణలో ఎంత భూమికి నీటి సౌకర్యం అందిందో చెప్పవలసి ఉంటుంది. అది పరీవాహక ప్రాంతం, జనాభా, ప్రజల అవసరాలు, రాష్ట్రానికి ఉండే మొత్తం వాటా వంటి అనేక ప్రాతిపదికల మీద ఆధారపడి, తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటా కన్న తక్కువా, సమానమా, ఎక్కువా చెప్పవలసి ఉంటుంది.

కాని రైతులు తమ సొంత నిధులు వెచ్చించి బావులు, బోరుబావులు, విద్యుత్ పంపుసెట్లు ఉపయోగించి కొత్తగా నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణాన్ని పెంచితే, దాన్నంతా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం అనుచితం, అనైతికం.

ఈ అన్యాయానికి మరొక కోణం కూడ ఉంది. తెలంగాణ రైతు బోరుబావికి, విద్యుత్ పంపుసెట్లకు విపరీతంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఇటీవల ఉచిత విద్యుత్తు అందుతున్నప్పటికీ, విద్యుత్ సరఫరా సక్రమంగానూ సరైన సమయాలలోనూ లేనందువల్ల విపరీతంగా మోటర్లు కాలిపోవడం, అందువల్ల ఖర్చు పెరిగిపోవడం కూడ జరుగుతోంది. మరొకపక్క కోస్తా రైతు, ముఖ్యంగా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో కాలువల కింద వ్యవసాయం సాగించే రైతుకు నీటి తీరువా తప్ప సాగునీటి గురించి మరే ఖర్చూ లేదు. అంటే తెలంగాణ రైతుకూ, కోస్తాంధ్ర రైతుకూ వ్యవసాయ ఖర్చులో గణనీయమైన తేడా విధానపరంగానే ఏర్పడి ఉంది. ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల రైతుల మధ్య విపరీతమైన అసమానత ఉంది. తెలంగాణ ఆందోళనలో ఇది ఒక ప్రధానాంశం. దీన్ని విస్మరించి నీటి పారుదల సౌకర్యం ఉన్న భూమి విస్తీర్ణం పెరిగింది అనడం మేధోపరమైన నిజాయితీ రాహిత్యం.

తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాల స్థితి గురించి మరొక అంశం కూడ ఉంది. తెలంగాణలో కాకతీయుల నాటినుంచీ కూడ ఇక్కడి నైసర్గిక స్థితిని బట్టి గొలుసు పద్ధతిలో చెరువులు, కుంటల వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఒక వాగుకు అడ్డంగా ఒక చెరువు, ఆ చెరువు మత్తడి నుంచి మొదలైన వాగు మరొక చెరువుకు చేరడం, మధ్యలో ఎక్కడ నైసర్గికమైన అవకాశం ఉంటే అక్కడ ఒక కుంట… ఇలా తెలంగాణ జిల్లాలలో వేలాది చెరువులు, కుంటలు ఏర్పడ్డాయి. 1956 తర్వాత ఈ చెరువులనూ, కుంటలనూ నిరాదరించడం మొదలయింది. మరమ్మతులు చేయడం, పూడిక తీయడం, గండి పడిన చెరువులను పూడ్చడం, చెరువు గర్భం భూముల దురాక్రమణను అడ్డుకోవడం, తూములను, కాలువలను బాగుచేయడం వంటి చర్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. మరొకపక్క పట్టణాల నిర్మాణం కొరకు వాగులనుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వుకుపోతూ ఉంటే ప్రభుత్వం చూసీచూడనట్టు ఉండిపోయింది. ఇసుక అక్రమ రవాణానే రాజకీయవాదుల సంపదకు ఒక వనరుగా మారిపోయింది. దానితో వాగులన్నీ క్రమక్రమంగా వట్టిపోయాయి. చెరువులు, కుంటలు నిండడం తగ్గిపోయింది. వాటికింద సాగుభూమి విస్తీర్ణం తగ్గిపోయింది. అలా తెలంగాణలో కాలువల కింద విస్తీర్ణం పెద్దగా పెరగలేదు, చెరువుల కింద విస్తీర్ణం తగ్గిపోయింది. బావుల కింద విపరీతంగా పెరిగింది. కాలువలకూ, చెరువులకూ ప్రభుత్వానిది బాధ్యత. బావులు రైతుల సొంత బాధ్యత. ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించలేదు అని వాదిస్తుంటే, అది పక్కన పెట్టి, రైతులు చేసిన పనిని ప్రభుత్వానికి ఆపాదించిందిన కమిటీ ఈ పరిణామాలను పరిశీలించింది గాని సరిగా విశ్లేషించడానికి ప్రయత్నించలేదు. అలా విశ్లేషించి ఉంటే, చేసిన తప్పుల ద్వారానూ, చేయని ఒప్పుల ద్వారానూ కూడ తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా ధ్వంసం చేశాయో అర్థమై ఉండేది.

ఎంత ఎక్కువ కరెంటు తింటే అంత అభివృద్ధి అట!!

తెలంగాణ అభివృద్ధి చెందిందనే అభిప్రాయాన్ని బలపరచడానికి కమిటీ ఉపయోగించిన ఇంకొక వాదన తెలంగాణలో విద్యుత్ వినియోగపు అంకెలు. నిజానికి ప్రశ్న తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా అన్నది కాదు, తెలంగాణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేసిందనేది, తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటా ఇచ్చిందా లేదా అనేది, పెద్దమనుషుల ఒప్పందం నాటినుంచీ యాభైనాలుగు ఏళ్లలో తానే ఇచ్చిన హామీలను నెరవేర్చిందా లేదా అనేది. ఆ ప్రశ్నలను పక్కన పెట్టి తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం కోస్తాంధ్రకన్న, రాయలసీమ కన్న ఎక్కువగా ఉంది గనుక తెలంగాణ అభివృద్ధి చెందినట్టే అని వాదించడం కుతర్కమే అవుతుంది గాని హేతుబద్ధ తర్కం కాదు.

తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉన్నట్టు అనేది ప్రపంచబ్యాంకు ప్రచారం చేస్తున్న భావజాలం. అది విద్యుదుత్పత్తి పరికరాల బహుళజాతి సంస్థల కోసం ఈ భావజాలాన్ని తయారుచేసిపెట్టింది. ఒక సమాజంలో అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ విద్యుత్ ఉత్పాదనను జనాభాతో విభజించి తలసరి విద్యుత్ వినియోగం అంకెను తయారు చేసి అది ఎంత ఎక్కువైతే అంత అభివృద్ధి అని ప్రపంచబ్యాంకు అంటుంది. ఆ అంకెను ఎక్కువ చేయడానికి విద్యుదుత్పత్తి కేంద్రాలు స్థాపించమనీ, బహుళజాతిసంస్థలనుంచి పరికరాలను కొనుక్కొమ్మనీ, దానికి తాను రుణం ఇస్తాననీ ప్రపంచబ్యాంకు చెపుతోంది. ఇదంతా ఆ సంస్థలు తమ ఉత్పత్తులు అమ్ముకునే ప్రయత్నం తప్ప ప్రజలు కరెంటు తిని, కరెంటు తాగి, కరెంటు పీల్చి బతకరు. కూడు, గూడు, గుడ్డ ఉన్న తర్వాత కరెంటు అవసరమే కావచ్చు, కూడు, గూడు, గుడ్డ ఉత్పత్తి చేయడానికి కరెంటు అవసరమే కావచ్చు. కాని కరెంటు వినియోగం ఎక్కువగా ఉన్నదని సగటు అంకెలు చెప్పినంత మాత్రాన ప్రజలకు అది అందుతున్నదనే హామీ ఏమీ లేదు. దానివల్లనే ప్రజాజీవితం మెరుగుపడుతుందన్న హామీ లేదు.

అంత మాత్రమే కాదు, విదేశాలకు ఎగుమతి కోసం సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైన పంటలు పండించే వ్యవసాయ రంగం, విదేశీ సంస్థలకు చౌక శ్రమను అందించే సేవారంగసంస్థలు వాడే కోట్లాది యూనిట్ల కరెంటును, ఇళ్లలో వాడే కరెంటును కలిపి జనాభాతో విభజించడం మరొక నిజాయితీ లేనితనం. ఇలా కనీస మేధో నిజాయితీ లేమితో ఒక విద్యుత్ వినియోగం అంకె తయారు చేసి, అది చూపుతూ తెలంగాణ అభివృద్ధి చెందింది, కనుక ఆ కారణం మీద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అడగడం సరయినది కాదు అని ఇల్లెక్కి అరవడం భయంకరమైన, క్షమించడానికి వీలులేని ధూర్తత్వం.

ఉద్యమ కారణాలు సాకులట, ఉద్యమకారులు పనిముట్లట!!

“తెలంగాణలోని చాల అణగారిన సమూహాలు కష్టభరితమైన జీవితం గడుపుతున్నాయి. అందువల్ల తీరేవైనా, తీరకుండా ఉండిపోయేవైనా వాగ్దానాల మీద రాజకీయ సమీకరణలు జరపడానికి, ఏదో ఒక సాకు మీద కూడగట్టబడడానికి ఈ జనం సిద్ధంగా ఉన్నారు” (పే. 108) అని నివేదిక రాసింది.

“తెలంగాణలో లోతైన అసమానతలు వేర్పాటు ఉద్యమానికి ఆజ్యం పోయడం మాత్రమే కాదు, దాన్ని ముందుకు నడపడానికీ, తీవ్రతరం చేయడానికీ ఉపయోగపడతాయి. అందువల్ల ప్రజానీకం రాజకీయ పార్టీలతో సహా స్వార్థప్రయోజన శక్తుల ఆందోళనలకు పనిముట్లుగా సులభంగా ఉపయోగపడతారు.” (పే. 119) అని మరొక చోట రాసింది.

ఒకవైపు ప్రజల కష్టభరితమైన జీవితం గురించీ, అసమానతల గురించీ ప్రస్తావిస్తూనే వారు తమ ఇష్టపూర్తిగా చైతన్యయుతంగా ఉద్యమించడంలేదనీ, వారు సాకులమీద ఉద్యమిస్తున్నారనీ, ఇతరులకు పనిముట్లుగా ఉపయోగపడుతున్నారనీ కమిటీ చాల అవమానకరమైన, దుర్మారమైన వ్యాఖ్య చేసింది. గత నలభై సంవత్సరాల చరిత్రను పక్కనపెట్టినా, ఈ పద్నాలుగు నెలల అనుభవాలనే చూసినా, కమిటీ పర్యటించినప్పుడు అన్ని ప్రజాసమూహాలూ, అన్ని వయసులవాళ్లూ కమిటీకి చెప్పినవి సరిగా విని ఉన్నా ఈ మాట అనడం ఆ ప్రజలను ఎంతగా అవమానించడమో, చిన్నచూపు చూడడమో కమిటీకి అర్థమై ఉండేది. నిజానికి ప్రజలు తమ సమస్యల మీద తామే స్వచ్ఛందంగా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆ సమస్యలలో కొన్నయినా తీరే అవకాశం వస్తుందని నమ్ముతున్నారు. రాజకీయ పార్టీల అవకాశవాదాన్ని కూడ తోసి రాజంటున్నారు. అందువల్ల వాళ్ల సమస్యలు సాకులనీ, వాళ్లు ఇతరులకు పనిముట్లుగా ఉపయోగపడుతున్నారనీ అనడం దురహంకారం.

తెలంగాణది వెనుకబాటుతనం కాదట!

తెలంగాణలో పేదరికం, వెనుకబాటుతనం ఉన్నాయా లేవా అని చర్చించడానికి, లేవని చెప్పడానికి కమిటీ చేసిన ఒక సర్కస్ ఫీటు చూస్తే చాల ముచ్చట కలుగుతుంది. ఇంతటి మేధావులు ఎంతటి కుటిలత్వానికి దిగజారవలసి వచ్చింది గదా అని జాలి కలుగుతుంది. వెనుకబడిన ప్రాంతాల సహాయ నిధి (బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ – బి ఆర్ జి ఎఫ్) అనే శీర్షిక కింద (పే. 80 – 81) కమిటీ చాల దుర్మార్గమైన, హాస్యాస్పదమైన వాదనలు చేసింది.

దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాలను, జిల్లాలను గుర్తించి, ఆ జిల్లాలకు అదనపు సహాయ నిధులు అందించడానికి కేంద్ర ప్రభుత్వానికి బి ఆర్ జి ఎఫ్ పథకం ఉంది. ఈ వెనుకబడిన జిల్లాలను ప్రణాళికా సంఘం గుర్తిస్తుంది. దేశంలోని 27 రాష్ట్రాల నుంచి 250 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినట్టుగా ప్రణాళికా సంఘం 2010 ఆగస్ట్ 9 న ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం కిందికి వచ్చిన జిల్లాలు 13 అయితే అందులో తొమ్మిది తెలంగాణ జిల్లాలే. అంటే తెలంగాణలో హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన జిల్లాలన్నీ వెనుకబడిన జిల్లాలేనని ప్రణాళికా సంఘం చెప్పిందన్నమాట. సరిగ్గా శ్రీకృష్ణ కమిటీ చెప్పదలచుకున్నదానికి ఇది వ్యతిరేకం గనుక, దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి, వక్రీకరించడానికి కమిటీ నివేదిక ప్రయత్నించింది.

ఈ “వెనుకబడిన జిల్లాల”లో జాతీయ ఉపాధి హామీ పథకం, ఇంటర్ మినిస్ట్రీ టాస్క్ గ్రూప్, రాష్ట్రీయ సమవికాస్ యోజన, జాతీయ పనికి ఆహార పథకం కింద గుర్తించిన జిల్లాలు కూడ కలిసే ఉన్నాయని కమిటీ రాసింది. అందులో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలను వామపక్ష తీవ్రవాదం ఉన్న జిల్లాలుగా సమవికాస్ యోజన కింద గుర్తించాలని హోంమంత్రిత్వశాఖ కోరిందని కమిటీ రాసింది. కనుక బి ఆర్ జి ఎఫ్ కింద చెప్పినట్టుగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను, 87 శాతం ప్రజలను వెనుకబడినవారుగా గుర్తించనక్కరలేదని, అందులో ఐదు జిల్లాలు, 46 శాతం ప్రజలు నక్సల్ వ్యతిరేక నిధులు పొందినందువల్లనే బి ఆర్ జి ఎఫ్ కిందికి వచ్చారని వాదించింది. కనుక తెలంగాణలో నిజమైన వెనుకబాటుతనం నాలుగు జిల్లాలలో, 41 శాతం ప్రజలలోనే ఉందని వాదించింది. “అందువల్ల, బి ఆర్ జి ఎఫ్ ను ఇలా విశ్లేషించి చూస్తే, తెలంగాణ ప్రాంతం నుంచి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని పౌరసమాజ బృందాలు చేసిన వాదనలు సరైనవి కాదని తేలుతుంది” (పే.81) అని ముక్తాయించింది. అబ్బ ఏమి తెలివి, ఏమి తెలివి!!

ఇతర వెనుకబడిన ప్రాంతాలతో పోటీ నివేదికలో చాల చోట్ల పోలికలు చెపుతూ ఉన్నప్పుడు గాని, విడిగా గాని ఆంధ్రప్రదేశ్ లో ఇతర వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు, నిరాదరణకు గురయిన ప్రాంతాలు ఉన్నాయని, తెలంగాణ కన్న వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని రాశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణతో సమానంగా గాని, అటూ ఇటూగా గాని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయనే విషయంతో ఎవరికీ పేచీ లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో, కోస్తాంధ్రలో కూడ కొన్ని చోట్ల సాధారణ ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉన్నదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. కాని కమిటీ ఆ వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించడం కోసం చూపడంలేదు. న్యాయమైన తెలంగాణ ఆకాంక్షలను అడ్డుకునే దురాలోచనతో మాత్రమే వాటిని ఎత్తిచూపుతోంది. ఆయా ప్రాంతాల ప్రజల వెనుకబాటు తనానికి బాధ్యత తెలంగాణ ప్రజలది కాదు. ఆ ప్రాంతాల వెనుకబాటు తనానికి కారణాలేమిటో, వాటికి పరిష్కారాలేమిటో కూడ కమిటీ చెప్పడం లేదు. కేవలం ఇతర ప్రాంతాలతో పోటీ పెట్టి తెలంగాణ ప్రాంతపు ప్రజల ఆకాంక్షలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

నిజంగా ఆ ప్రాంతాల ప్రజల మీద ప్రేమ ఉంటే వారికి కూడ అన్యాయం చేసిన యాభైనాలుగు సంవత్సరాల పాలకవిధానాలను నిశితంగా పరిశీలించి విమర్శించవలసింది. నిజం చెప్పాలంటే తమకు కోస్తాంధ్ర పాలకుల చేతిలో అన్యాయం జరగబోతుందని తెలంగాణ కన్న పదహారు సంవత్సరాల ముందే గుర్తించి, రక్షణ కోసం శ్రీబాగ్ ఒడంబడిక కుదుర్చుకున్నది రాయలసీమ. ఆ ఒడంబడికలోని రక్షణలు ఎందుకు అమలు కాలేదో శ్రీకృష్ణ కమిటీ ఆలోచించి ఉండవలసింది. రెండు జీవనదులు, అడవి, ఖనిజాలు, సముద్రతీరం, కష్టజీవులైన ప్రజలు – అన్ని వనరులూ పుష్కలంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు ఇవాళ్టికీ పొట్ట చేత పట్టుకుని దేశదేశాలు వలస ఎందుకు పోవలసి వస్తున్నదో కమిటీ ఆలోచించి ఉండవలసింది. మధ్యనుంచి కృష్ణానది ప్రవహిస్తూ ఉండగా, నల్లమల అడవి ఉండగా, సిమెంటు పరిశ్రమకు అవసరమైన ఖనిజ నిలువలు ఉండగా, పొరుగున అభివృద్ధి చెందిన కాలువల వ్యవసాయపు భూములు ఉండగా పల్నాడు ఎందుకు దారిద్ర్యంలో మగ్గిపోతున్నదో కమిటీ ఆలోచించి ఉండవలసింది. తెలంగాణ వనరులను కొల్లగొట్టడానికి సమైక్యరాగం ఆలపిస్తున్నట్టు నటిస్తున్న కోస్తాంధ్ర పాలకవర్గాలు తమ ప్రాంతంలోనే దళితులతో ఎన్నడూ సమైక్యంగా ఉండలేదని, ఆ ఘర్షణకు హింసాత్మక నిదర్శనాలుగా కంచికచెర్ల, కారంచేడు, నీరుకొండ, చుండూరు వంటి అనేక దురంతాలున్నాయని కమిటీ గుర్తించవలసింది. అలా ఆలోచిస్తే తెలంగాణ వెనుకబాటుతనానికి, వివక్షకు మాత్రమే కాదు, రాష్ట్రంలోని ఈ అన్ని ప్రాంతాల వెనుకబాటుతనానికి పాలకవర్గాలే, పాలకవిధానాలే కారణమని కమిటీకి అర్థమై ఉండేది. అప్పుడు ఆ పాలకవిధానాలలో ప్రత్యేకంగా ఉన్న ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటపు న్యాయబద్ధత అర్థమై ఉండేది.

హైదరాబాద్ మీద అధికారమే కీలకం

కమిటీ అనేక చోట్ల కోస్తాంధ్రకూ, రాయలసీమకూ హైదరాబాద్ ఎంత కీలకమైనదో ప్రస్తావించింది. ప్రత్యేకంగా ఒక అధ్యాయమే హైదరాబాద్ కోసం కేటాయించింది. చివరికి సిఫారసులలోనూ హైదరాబాద్ ను విస్తరించి కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని సూచించింది.

హైదరాబాద్ పట్ల ఈ దృక్పథం ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన పెట్టుబడిదారులకు, ప్రపంచీకరణ క్రమంలో హైదరాబాద్ ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టిన బహుళజాతి సంస్థలకు సంబంధించినది. హైదరాబాద్ మీద తమ అధికారాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం తప్పకపోతే, హైదరాబాద్ ను విడదీసి తెలంగాణను ధ్వంసం చేసి ఇవ్వడానికి, కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. మన్మోహన్ సింగ్, చిదంబరంల దగ్గరినుంచి ప్రపంచీకరణ, బహుళజాతిసంస్థల ప్రతినిధులందరూ ఈ ప్రయత్నాలకు వత్తాసు పలుకుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ పట్ల తీసుకున్న వైఖరిని ఈ మొత్తం ఆలోచనాసరళిలో భాగంగానే చూడాలి.

హైదరాబాద్ మీద కన్ను ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులలో, సంపన్నులలో ఎక్కువమంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గనుక వారిలో హైదరాబాద్ లోని తమ ఆస్తులకు, వ్యాపారాలకు ఏమి జరుగుతుందోననే ఆందోళన ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలలోని మామూలు ప్రజలకేమో, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే మహానగరం తమకు దూరమైపోతుందనీ, అటువంటి మహానగరాన్ని నిర్మించుకోవడానికి తమకు ఒక తరమయినా పడుతుందనీ, ఈలోగా తమ అవసరాలు తీర్చే నగరం ఉండదనీ అనుమానాలున్నాయి.

ప్రజలలోని ఈ అనుమానాల్ని ఆసరా చేసుకుని, తమ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కొరకు రాజకీయ నాయకులు అనేక అబద్ధాలు, భ్రమలు ప్రచారం చేశారు. తమవల్లనే హైదరాబాదు అభివృద్ధి అయిందని అన్నారు. తాము రాకముందు హైదరాబాదులో తొండలు గుడ్లు పెట్టేవని ఒకరనగా, తాము హైదరాబాదులో చేసిన అభివృద్ధికి తమకు పరిహారం చెల్లించాలని మరొకరన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబర్ 31 దాకా రాజధానిగా ఉన్న కర్నూలు స్థాయిని త్యాగం చేసి, హైదరాబాద్ ను రాజధాని చేశామని, ఆ త్యాగానికి ప్రతిఫలంగా తమకు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కొందరు, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు సన్నాయి నొక్కులు నొక్కారు. తమకు దక్కకపోతే ఇతరులకు కూడ దక్కకుండా పాడుచేస్తామని అనే ధూర్తుల లాగ కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు హైదరాబాద్ చరిత్ర గురించీ, హైదరాబాద్ అభివృద్ధి గురించీ నోటికి వచ్చిన అబద్ధాలు, అవాకులూ చవాకులూ మాట్లాడారు. చరిత్రనూ, వాస్తవాలనూ పరిగణనలోకి తీసుకుని న్యాయం చెప్పవలసిన తీర్పరి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ అబద్ధాలకు లొంగిపోయి నివేదిక రాసింది.

హైదరాబాద్ ఏర్పడిన 1591 నుంచి 1687 వరకు రాజధాని కాదు. ఆనాడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు గోల్కొండ రాజ్యంలో భాగమే అయినా ఆ ప్రాంతాల నుంచి చెప్పుకోదగిన ఆదాయం వచ్చిందనే దాఖలాలు గాని, దాన్ని హైదరాబాదుకు ఖర్చుపెట్టిన దాఖలాలు గాని లేవు. ఆ తర్వాత ఏడు దశాబ్దాల పాటు రాజధానిగా ఔరంగాబాదు ఉండింది గనుక అప్పుడు కూడ హైదరాబాదు అభివృద్ధి ఏమీ జరగలేదు. ఇక 1763లో హైదరాబాదు రాజధాని అయినప్పటికీ ఇవాళ్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు, ఈ రాజ్యం నుంచి 1766లో, 1787లో, 1799లో వేరయిపోయాయి. నిజానికి హైదరాబాదు ఆధునిక నగరంగా ఎదిగినది 1850ల తర్వాత ప్రధానిగా సాలార్ జంగ్ అమలు చేసిన సంస్కరణల కాలంలో. అప్పటికి కోస్తాంధ్ర, రాయలసీమలు హైదరాబాదు రాజ్యంలో భాగం కావు గనుక వాటికి ఆ అభివృద్ధిలో భాగం ఉండే అవకాశం లేదు. 1956 నవంబర్ 1 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ కలిసిన ప్రాంతానికి హైదరాబాదు రాజధానిగా ఉంది గనుక ఈ యాభై నాలుగు సంవత్సరాలలో హైదరాబాదులో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, వాటికి ఖర్చు పెట్టిన నిధులలో ఏ ప్రాంతం వాటా ఎంత అనే విషయం లెక్కలు వేసుకోవచ్చు. మొత్తంగా మూడు ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయం ఎంత, ఆయా ప్రాంతాలలో జరిగిన ప్రభుత్వ వ్యయం ఎంత అని కూడ లెక్కలు తేల్చవచ్చు.

ఇక ప్రైవేటు పెట్టుబడుల విషయానికి వస్తే నాలుగు శతాబ్దాల హైదరాబాదు చరిత్రలో ఇరానియన్లు, కాయస్తులు, సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు, తమిళులు మొదలయిన అనేక జాతులవారు ఇక్కడికి వచ్చి తమ పెట్టుబడులు పెట్టారు. నగరానికి తాము ఇవ్వగలిగింది ఇచ్చారు. ఏ ఒక్కరూ ఈ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని గాని, తమ వాటా తమకు ఇమ్మని గాని అడగలేదు. అసలు ప్రపంచ చరిత్రలోనే అన్ని నగరాలూ అనేక జాతుల, ప్రజాసమూహాల కృషితో నిర్మాణమయ్యాయి గాని “ఈ నగరం అభివృద్ధి మావల్లనే అయింది, కాబట్టి వదిలి వెళ్లాలంటే నష్టపరిహారం ఇవ్వండి” అని ఎవరూ ఎక్కడా అడగలేదు. ఏ నగరమయినా భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికే చారిత్రకంగా, సాంస్కృతికంగా చెంది ఉంటుంది. తెలుగు వాళ్లు ఎంత అడిగినా మద్రాసు విషయంలో అదే జరిగింది. గుజరాతీలు ఎంత అడిగినా బొంబాయి విషయంలో అదే జరిగింది. ఆమాటకొస్తే ఇంగ్లండ్ భారతదేశాన్ని వలసగా ఆక్రమించకుండా ఉండి ఉంటే, భారత సంపదను దోచుకోక పోయి ఉంటే లండన్ నగరం అభివృద్ధి చెంది ఉండేదే కాదు. కాని భారత జాతీయోద్యమం లండన్ అభివృద్ధిలో తమ వాటా గురించి ఎన్నడూ అడగలేదు.

అంతేకాదు, నిజాం రాజవంశం, ముఖ్యంగా 1913 నుంచి 1948 దాకా పాలించిన ఏడవ నిజాం నిరంకుశ భూస్వామ్యం పునాదిగా పాలించారు గనుక హైదరాబాద్ రాజ్య ప్రజల గోళ్లూడగొట్టి అనేకరకాల పన్నులు వసూలు చేసి హైదరాబాదును అభివృద్ధి చేశారు. అంటే హైదరాబాదు నిండా ఉన్నది హైదరాబాదు రాజ్య ప్రజల నెత్తురూ చెమటా మాత్రమే. అందులో ఐదు మరాఠ్వాడా జిల్లాల, మూడు కన్నడ జిల్లాల ప్రజల భాగస్వామ్యమయినా ఉంది గాని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల పాత్ర లేదు. అలాగే, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్ఫ్ ఎ ఖాస్ అనే పేరు మీద తనకు తానే సొంత భూమి రాసుకున్నాడు. రాజ్యంలోని ఐదు కోట్ల ఎకరాలలో యాభైలక్షల ఎకరాల భూమి ఇలా ఆయన సొంత ఆస్తిగా ఉండేది. అందులో ఇవాళ హైదరాబాదులో చేరిన ఆరు వందల గ్రామాల భూములు ఉన్నాయి. ఆ లక్షలాది ఎకరాల భూమి నిజానికి హైదరాబాద్ రాజ్య ప్రజల శ్రమ ఫలితం. దాన్ని లీజులకు ఇచ్చి, అమ్మి, అన్యాక్రాంతం చేసి, రియల్ ఎస్టేట్ గా మార్చిన పాలకులు ఆ డబ్బుతో హైదరాబాద్ ను “అభివృద్ధి” చేసి, మేమే అభివృద్ధి చేశామని అనడం అనైతికం, అచారిత్రికం.

ఈ సమస్యను మరొకవైపు నుంచి కూడ ఆలోచించవలసి ఉంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? ఏ ప్రమాణాలు ప్రాతిపదికగా అభివృద్ధిని లెక్కిస్తున్నారు? హైదరాబాద్ అభివృద్ధి అంటే హైదరాబాద్ లో నివసించే ప్రజల అభివృద్ధా, లేక హైదరాబాద్ లో కొన్ని భవనాలు, ఫ్లై ఓవర్లు, విమానాశ్రయం వంటి హంగులు రావడమా? అభివృద్ధి అంటే ప్రజల నిత్యజీవిత జీవన ప్రమాణాలలో కనబడే మెరుగుదలా, కేవలం కొన్ని సగటు అంకెలలో కనబడే పెరుగుదలా? అభివృద్ధి అంటే జీవనోపాధి అవకాశాలు పెరగడమా, జనజీవనంతో సంబంధం లేని తళుకుబెళుకులు పెరగడమా?

హైదరాబాద్ అభివృద్ధి గురించి అటూ ఇటూ సాగుతున్న వాదనలన్నీ ప్రజాజీవితంలోని అభివృద్ధిని కాక, హంగులనే అభివృద్ధిగా చూస్తున్నట్టు కనబడుతున్నది. నిజానికి గత ఐదు దశాబ్దాలలో హైదరాబాద్ లో మురికివాడల సంఖ్య వందలరెట్లు పెరిగింది. హైదరాబాద్ అప్పుడూ ఇప్పుడూ కూడ దేశంలో ఐదవ స్థానంలోనే ఉన్నది. పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా పౌరసౌకర్యాలు పెరగలేదు. విద్యా, వైద్య, ఆరోగ్య, రవాణా, పారిశుధ్య, వినోద, విహార సౌకర్యాలలో ఏ ఒక్కటి చూసినా గత ఐదు దశాబ్దాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు పెరగలేదని స్పష్టమవుతుంది. కనుక ఈ పెరుగుదలను అభివృద్ధి అనడం మొదటి తప్పు. ఇది సగటు అంకెలలో పెరుగుదలే తప్ప ప్రజల అభివృద్ధి కాదు.

హైదరాబాద్ అభివృద్ధి గురించి సగటు అంకెలు మాత్రం చూపుతూ, అంకెల గారడీ చేస్తూ, ఇతర సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకపోవడం అంతకన్న మించిన తప్పు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిగా ఉండిన, పాత సర్ఫ్ ఎ ఖాస్ భూమి మీద తెలంగాణ ప్రజల ఉమ్మడి యాజమాన్యం ఉండాలి. ఆ భూమిని రాచరిక ప్రభుత్వం హైదరాబాద్ రాజ్య ప్రజల నుంచి కొల్లగొట్టింది గనుక దాన్ని తిరిగి ప్రజలకే అప్పగించాలి. కాని 1956 నుంచి కూడ అన్ని ప్రభుత్వాలూ ఆ భూమిని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు, ప్రైవేటు పెట్టుబడిదారులకు, సినిమా పరిశ్రమకు, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకు లీజు పేరుమీదనో, అతి చౌక ధరలకో, ఉచితంగానో అప్పగించాయి. అలా భూమిని అడ్డగోలుగా పందేరం చేయడమే అభివృద్ధి అని తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేశాయి. అలా అన్యాక్రాంతమైన భూమి కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది.

ఆ రకంగా హైదరాబాద్ భూమిని వాడుకుని ఏర్పాటు చేసిన జాతీయ, అంతర్జాతీయ, ప్రభుత్వ రంగ సంస్థలలో భూమిపుత్రులకు కనీసం న్యాయమైన వాటా ఉద్యోగకల్పన కూడ జరగలేదు. ప్రైవేటు సంస్థలలో భూమిపుత్రుల వాటా గురించి అడగడానికే వీలు లేదు. అంటే భూమి విషయంలో హైదరాబాద్ లో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధి ఏమయినా ఉంటే అది తెలంగాణ ప్రజలకు మాత్రం దక్కలేదు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగానే జరిగింది. పైగా ఇటువంటి వికృత అభివృద్ధి వల్ల రియల్ ఎస్టేట్ ధరలు కృత్రిమంగా విపరీతంగా పెరిగిపోయి, ఇరుగుపొరుగు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడదలచిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు కనీసం చారెడు భూమి దక్కని పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ అభివృద్ధిలో ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులు చూపుతున్నవి తాము పెట్టిన పరిశ్రమలు. రెడ్డి లాబ్స్, అరబిందో ఫార్మా, సత్యం కంప్యూటర్, నాట్కో, మాట్రిక్స్, శాంతా బయోటెక్, సిరిస్, రాంకీ, రామోజీ ఫిల్మ్ సిటీ, జయభేరి, లాంకో వగైరా అనేక కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల పరిశ్రమలు, వ్యాపారాలు వచ్చిన మాట నిజమే. కాని ఈ పరిశ్రమలు, వ్యాపారాలు వాడుకున్నది హైదరాబాద్ భూములను. ఉద్యోగాలు కల్పించినది మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన వారికి. ఆ పరిశ్రమల కాలుష్యం వల్ల నష్టపోయినది హైదరాబాద్ సాధారణ ప్రజలు తాగేనీరు, పీల్చే గాలి, కుంటో సెంటో వ్యవసాయం చేసుకునే భూమి. రసాయన, ఔషధ పరిశ్రమలను అభివృద్ధి చేసి హైదరాబాద్ ను అంతర్జాతీయ చిత్రపటం మీద చేర్చామని గొప్పలు చెపుతున్న వారి అసలు ఉద్దేశ్యం హైదరాబాద్ వనరులను, ప్రజాజీవితాన్ని ధ్వంసంచేసి తాము ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించడమేనని, వారు తిరిగి హైదరాబాద్ కు గాని, తెలంగాణకు గాని ఇచ్చినది ఏమీ లేదని గత ఐదు దశాబ్దాల చరిత్ర చెపుతుంది.

ఈ పెట్టుబడిదారులకు సర్ఫ్ ఎ ఖాస్ భూమి కూడ చాలక, హైదరాబాద్ లో ఉండిన వందలాది చెరువులను పూడ్చి రియల్ ఎస్టేట్ చేశారు. మూసీనది, నక్కవాగు వంటి సహజసిద్ధమైన సెలయేళ్లను విషపదార్థాల, మురికినీటి ప్రవాహాలుగా మార్చారు. లక్షల ఏళ్లుగా ఉన్న కొండలను పిండి చేసి, భవంతులు కట్టుకున్నారు. నగరమంతా వ్యాపించి ఉన్న తోటలను ధ్వంసంచేసి నగరంలో స్వచ్ఛమైన ప్రాణవాయువు లేకుండా చేశారు. వందల సంవత్సరాలుగా ఉన్న కుతుబ్ షాహి, అసఫ్ జాహి భవనాలను ధ్వంసం చేశారు. నేలమట్టం చేశారు. హైదరాబాద్ తెహజీబ్ గా ప్రఖ్యాతమైన సహజీవన సంస్కృతిని, స్నేహ సౌభ్రాతృత్వాలు విలసిల్లిన సంస్కృతిని ధ్వంసంచేసి కొనుగోలు – అమ్మకాల మార్కెట్ సంస్కృతిని ప్రవేశపెట్టారు.

కనుక హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారిన తర్వాత నిజంగా అభివృద్ధి అయిందా, ధ్వంసం అయిందా లెక్కలు వేయాలంటే, కేవలం పెట్టుబడులు, లాభాలు, జనాభా పెరుగుదల అంకెలు మాత్రమే కాదు. కాలుష్యం, భూమి అక్రమ వినియోగం, పర్యావరణ విధ్వంసం, జనజీవన కాలుష్యం, సంస్కృతీ విధ్వంసం మొదలయిన అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ పరిణామాలను కూడ లెక్కలోకి తీసుకోవాలి.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన, శాస్త్రీయమైన పనిలో సంపూర్ణంగా విఫలమై, హైదరాబాద్ ను ఎన్ టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని రాసింది. ఈ ఒక్క వ్యాఖ్యతోనే ఇది ప్రజాజీవితాన్ని పరిశీలించిన కమిటీ కాదని, విమానాశ్రయాన్ని, ఫ్లై ఓవర్లను, భవనాలను, తళుకుబెళుకులను మాత్రమే చూసిన కమిటీ అని స్పష్టమవుతుంది.

మచ్చుకు ఒక అధ్యాయం చూద్దాం

ఇలా చెపుతూపోతే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతిపేజీని జల్లెడ పట్టవచ్చు గాని, ఇక్కడ మచ్చుకు ఉద్యోగుల గురించిన అధ్యాయం మాత్రం చూద్దాం.

నివేదిక మొదటి రెండు అధ్యాయాలలోనూ, చివరి అధ్యాయంలోనూ ప్రభుత్వోద్యోగాల గురించి స్థూలంగా చర్చించడంతో పాటు ఐదవ అధ్యాయంలో యాభై పేజీలలో ప్రత్యేకంగా ప్రభుత్వోద్యోగుల సమస్యలు చర్చించారు. ప్రభుత్వోద్యోగాలలో, విద్యావకాశాలలో రిజర్వేషన్ అనే భావన ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఫర్ రెగ్యులేషన్ & కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ ముఖేష్ కక్కడ్ తో సాంకేతిక అధ్యయనం కూడ చేయించామని రాసుకున్నారు. కమిటీలో ఉన్న ఐదుగురు నిపుణులు, బయటి నుంచి సహకరించిన మరొక నిపుణుడు కలిసి వండిన ఈ బ్రహ్మ పదార్థం ఎంత రుచీపచీలేని వంటకంగా, ఇంగిత జ్ఞానం ఉన్నవారు నోట పెట్టలేని వంటకంగా తయారయిందో చూద్దాం.

మొదటి అధ్యాయంలోని ఒక మెతుకు పట్టి చూస్తేనే ఈ వంట సంగతి తేలిపోతుంది. ‘ఆంధ్రప్రదేశ్ పరిణామాలు – ఒక చారిత్రక నేపథ్యం’ అనే ఈ అధ్యాయంలో పే. 30 లో “పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వైర్ మెంట్ యాజ్ టు రెసిడెన్స్) యాక్ట్ 1957 ప్రవేశపెట్టడంతో ముల్కీ నిబంధనలు రద్దయిపోయాయి” అని రాశారు. ఈ మాట అబద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. అధికారికంగా చూస్తే 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడేదాకా ముల్కీ నిబంధనలు రద్దు కావడానికి అవకాశం లేదు, రద్దు కాలేదు. నివేదికలోనే అనేక చోట్ల ఈ ప్రస్తావన ఉంది. చారిత్రకాంశాలను ఇంత అపసవ్యంగా అర్థం చేసుకున్న నివేదిక, మొదటి అధ్యాయంలో ఇరవై పేజీలు ఉద్యోగుల విషయాలు రాసి, ఆ తర్వాత పే. 48లో “ఈ సమస్య ఇవాళ్టికి కూడ చాల వివాదాస్పదంగా ఉంది. అందువల్ల, ఈ వ్యవహారాన్ని సమగ్రమైన పద్ధతిలో పరిశీలించడానికి ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించాం” అని రాసింది. ఆ “సమగ్రమైన పద్ధతి” ఎంత సమగ్రంగా సాగిందో చూద్దాం.

ఐదో అధ్యాయంలో పే. 246 లో ముల్కీ నిబంధనలు 1919-1959 అని రాసిన పరిచయ వాక్యాలలోనే “ఉర్దూ భాషలో ‘ముల్క్’ అంటే జాతి (నేషన్), అక్కడ నివాసం ఉండేవారిని ‘ముల్కీలు’ అంటారు. ప్రభుత్వోద్యోగాలలో ‘నివాసుల’ ప్రయోజనాలు పరిరక్షించే విధానంగా ముల్కీ నిబంధనలు వచ్చాయి” అని అర్థం పర్థం లేని వాక్యం రాశారు. ముల్క్ అంటే జాతి కాదు, ఆ మాటకు అర్థం దేశం, రాజ్యం, ప్రాంతం. ముల్కీ అంటే దేశీయులు, ప్రాంతీయులు, స్థానికులు, భూమిపుత్రులు అవుతుంది గాని ‘నివాసులు’ కాదు, అక్కడ నివాసం ఉండేవాళ్లందరూ కాదు. ఇది కేవలం భాషా సమస్య కాదు, అసలు హైదరాబాద్ రాజ్యంలో ముల్కీ నిబంధనలు ఏ మౌలిక ప్రాతిపదిక మీద వచ్చాయో అర్థం చేసుకోవడానికి కమిటీ ప్రయత్నించలేదనడానికి ఇది రుజువు. హైదరాబాద్ రాజ్యంలో ప్రభుత్వోద్యోగాలలో అటు ఇరానియన్లు, ఇతర ప్రభువర్గాల బంధువులు, ఇటు ఉత్తరాది నుంచి వచ్చిన కాయస్ఠులు వగైరాలు నిండిపోతున్నప్పుడు ప్రభుత్వోద్యోగాలలో దేశీయులకు, స్థానికులకు, భూమిపుత్రులకు ప్రాధాన్యత ఉండాలనే ఆకాంక్ష ఫలితంగానే ముల్కీ నిబంధనలు వచ్చాయి. ఆ మాటకొస్తే అప్పటికి ఉద్యోగాలు పొందుతున్న వాళ్లు హైదరాబాద్ నివాసులే. కాని హైదరాబాద్ దేశీయులు, స్థానికులు, భూమిపుత్రులు కాదు. “నివాసులు” అనే మాట ద్వారా చూస్తే ఆ ఆకాంక్ష బలం ఏమిటో అర్థం కాదు.

పే. 250లో “విశాలాంధ్ర ఏర్పడాలనే తపనలో, ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు హామీలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు” అని నివేదిక రాసింది. ఈ వాక్యంలో ఆంధ్ర నాయకులు ఏదో హృదయవైశాల్యంతో ఆ హామీలు ఇచ్చారనే ధ్వని, విశాలాంధ్ర ఏర్పరచడం అనే లక్ష్యం కోసం త్యాగం చేశారనే ధ్వని వినిపిస్తోంది. కాని 1953-56 చరిత్ర చూస్తే, విశాలాంధ్ర భావనను తెలంగాణ ప్రజలు అనుమానంతో చూసినప్పుడు, బుజ్జగించి, హామీ ఇచ్చి, ప్రలోభపెట్టి అయినా సరే, విశాలాంధ్ర ఏర్పరచాలనే కుటిల ఎత్తుగడగానే ఆ వాగ్దానాలు వచ్చాయి. తెలంగాణను ఆక్రమించడానికి, హైదరాబాద్ ను కబ్జా చేయడానికి తపనే తప్ప అది విశాలాంధ్ర ఏర్పడాలనే తపన కాదు. జాతి ఐక్యత, భాషా ఐక్యత అనే ఆకర్షణీయమైన ముసుగు నాటి పాలకులకు బాగా ఉపయోగిపడింది. ఆ తర్వాత గడిచిన ఐదు దశాబ్దాల చరిత్ర అది కుటిల ఎత్తుగడ అనీ, అవి చిత్తశుద్ధిలేని వాగ్దానాలనీ రుజువు చేసింది.

పే. 251లో 1956 పెద్దమనుషుల ఒప్పందం గురించి రాస్తూ, “కిందిస్థాయి ఉద్యోగాల నియామకాల విషయంలో ఐదు సంవత్సరాల వరకు తాత్కాలికంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలనుకున్నారు” అని శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాసింది. ఇది పచ్చి అబద్ధం. తప్పు.

ఇక్కడ కమిటీ చేసిన తప్పు గురించి మాత్రమే కాదు, చరిత్రలో జరిగిన మోసం గురించి కూడ చెప్పవలసి ఉంది. కొత్త ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో 1956 ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో ఎనిమిది మంది ‘పెద్దమనుషుల ఒప్పందం’ కుదిరింది. ఆ ఒప్పందంలో ఏడో అంశం “ఒక రకమైన స్థానికతా సూత్రాన్ని, ఉదాహరణకు 12 సంవత్సరాల స్థానిక నివాసాన్ని, ప్రాతిపదికగా తీసుకుని తెలంగాణలో ఉద్యోగ నియామకాలలో నిర్ణీత నిష్పత్తి సాధించాలి” అని చెపుతుంది. నిజానికి అప్పటివరకూ కొనసాగుతున్న ముల్కీ నిబంధనలలో ‘పుట్టుక’, ‘వారసత్వం’తో పాటు ‘15 సంవత్సరాల నివాసం’ అనే ప్రాతిపదికలు ఉండేవి.

హైదరాబాద్ మీద 1948 సెప్టెంబర్ 17న జరిగిన పోలీసుచర్య అనే సైనికదాడి తర్వాత, ప్రధానంగా తమిళ, కోస్తాంధ్ర అధికారులతో కూడిన సైనిక ప్రభుత్వం 1950, 51లలో తెచ్చిన నిబంధనలలో ‘పుట్టుక’, ‘వారసత్వం’ అనే ప్రాతిపదికలు ఎగరగొట్టారు. ఆ తర్వాత 1956లో ‘పెద్దమనుషుల ఒప్పందం’లో 15 సంవత్సరాల ప్రాతిపదికను 12 సంవత్సరాలకు కుదించారు. అక్కడితో ఆగలేదు. 1956 ఫిబ్రవరిలో కుదిరిన 14 అంశాల ఒప్పందం, ఆగస్ట్ 10న లోక సభలో ప్రవేశపెట్టే సమయానికి దానిలో చాల మార్పులు చేశారు. వాక్యాలకు వాక్యాలే మారిపోయాయి. ఆగస్ట్ నాటికి అది 10 అంశాల ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్’ (రక్షణల పత్రం) గా మారిపోయింది. మొదటి ఆరు అంశాలకు ఎ అని, తర్వాత అంశాలకు బి, సి, డి, ఇ అని పేర్లు పెట్టారు. అందులో ‘బి. స్థానికత నిబంధనలు’ కింద “ఐదు సంవత్సరాల కొరకు తాత్కాలిక సౌకర్యం”గా దీన్ని చేర్చారు. ఈ “ఐదు సంవత్సరాల తాత్కాలిక సౌకర్యం” అన్నమాట ‘పెద్దమనుషుల ఒప్పందం’ కాదు. ‘పెద్దమనుషుల ఒప్పందం’లో లేదు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఈ గందరగోళాన్ని, మార్పులను, వక్రీకరణలను ప్రస్తావించనైనా ప్రస్తావించకుండా, “ఐదు సంవత్సరాల వరకు తాత్కాలికంగా” అని మాత్రం రాసిందంటే దాని దురుద్దేశం అర్థమవుతుంది.

సమగ్రపద్ధతిలో పరిశీలించడానికి ప్రత్యేకంగా కేటాయించిన అధ్యాయంలో పే. 271 లో రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత హఠాత్తుగా గిర్ గ్లాని కమిషన్ ప్రస్తావన వస్తుంది. ఈ మధ్యలో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర అదృశ్యమై పోతుంది. పోనీ గిర్ గ్లాని కమిషన్ గురించి అయినా సమగ్రంగా రాశారా అంటే అదీ లేదు. గిర్ గ్లాని పరిశీలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను, కోస్తా, రాయలసీమ అధికారులు ఆ కమిషన్ కు చేసిన సహాయ నిరాకరణను కమిటీ ప్రస్తావించనే లేదు. నిజానికి ప్రభుత్వం నియమించిన అధికారిక కమిషన్ అయినప్పటికీ, గిర్ గ్లాని కమిషన్ కోరిన సమాచారాన్ని అనేక ప్రభుత్వ శాఖలు ఇవ్వకపోవడంతో పూర్తి నివేదిక రాయలేకపోయానని ఆ కమిషనే చెప్పుకున్నది. ఎన్నో పనికిమాలిన విషయాలను చాల వివరంగా తు.చ. తప్పకుండా రాసిన శ్రీకృష్ణ కమిటీ గిర్ గ్లాని నిర్ధారణలను మాత్రం పైపైన రాసి వదిలేసింది. ఆ నిర్ధారణలను రాయకుండానే “గిర్ గ్లాని నివేదికను ఆమోదించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు” అని మళ్లీ సాగదీసింది.

గిర్ గ్లాని నివేదిక సిఫారసులను అమలు చేయడంలో ప్రభుత్వం చేసిన పనులు అని పే. 278-280 లలో ఇరవై అంశాలు రాసింది. దానిలో శాఖాధిపతుల సంఖ్యను 51 నుంచి 102కు పెంచడం జరిగిందని, స్థానికేతరుల సంఖ్యను జిల్లా స్థాయిలో 15 శాతానికి, జోన్ స్థాయిలో 25 శాతానికి పరిమితం చేస్తూ రాష్టపతి ఉత్తర్వులను పాటించడం జరిగిందని రాశారు.

శాఖాధిపతుల సంఖ్యను పెంచడం రాష్ట్రపతి ఉత్తర్వులకు తూట్లు పొడవడానికేనని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలు కావలసిన స్థానిక రిజర్వేషన్ నుంచి మినహాయించడానికేనని ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరికయినా అర్థమవుతుంది. కాని శ్రీకృష్ణ కమిటీ మాత్రం అది తెలంగాణ అనుకూల చర్య అన్నట్టుగా రాసింది. అలాగే, రాష్ట్రపతి ఉత్తర్వులలో ఎక్కడా స్థానికేతరుల సంఖ్య గురించి నిబంధన లేదు, స్థానికులకు తప్పనిసరిగా ఉండవలసిన వాటా ఉంది. దాని అర్థం మిగిలినదంతా ఇతరుల వాటా అని కాదు. అటువంటి వ్యాఖ్యానం సరైనది కాదు. గిర్ గ్లాని ఎత్తిచూపిన 18 వక్రీకరణలలో 16 వక్రీకరణలను సరిదిద్దడం జరిగిందనీ, మొత్తంగా అదనంగా ఉన్న 18,856 ఉద్యోగులలో 14,784 మందిని స్వస్థలాలకు పంపించడం జరిగిందనీ శ్రీకృష్ణ కమిటీ రాసింది. కాగితం మీద జరిగిన ఈ బదిలీలు నిజంగా తెలంగాణ ఉద్యమం కోరినట్టుగా జరగలేదు. కాగితం మీద జరిగినవి కూడ న్యాయస్థానాల, ట్రిబ్యునళ్ల వివాదపు చిక్కుముడులలో ఇరుక్కుపోయాయి.

రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకుండా గడిచిన 26 సంవత్సరాలలో దాన్ని ఎవరూ న్యాయస్థానాలలో సవాలు చేయకపోవడం గుర్తించవలసిన విషయం (పే. 281) అని శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేకంగా రాసింది. అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని, దాన్ని సాగనిచ్చిన అధికారవర్గాలను ప్రశ్నించడం లేదు. దాన్ని ప్రజలు గాని, బాధితులు గాని న్యాయస్థానాలలో ప్రశ్నించలేదు గనుక వారి మీదనే తప్పు నెట్టడానికి కమిటీ ప్రయత్నించింది. అహా, ఏమి తర్కం!

హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో జరిగిన అన్యాయాల గురించి ఇటీవల జరిగిన ఆందోళన గురించి అవసరమైనదానికన్న ఎక్కువ వివరంగా రాసి, ఆ సమస్యను మంత్రుల కమిటీ ఎంత అద్భుతంగా పరిష్కరించిందో కితాబునిచ్చింది. ఆ 69 ఉద్యోగాలలో మూడు ప్రాంతాల మధ్య, సామాజిక వర్గాల మధ్య పంపిణీ ఎంత బాగా జరిగిందో అవసరం లేకపోయినా వివరంగా చెప్పి మరీ ప్రశంసించింది. 69 ఉద్యోగాల విషయంలో ఇంత జాగ్రత్త చూపిన కమిటీకి రాష్ట్రంలోని పన్నెండు లక్షల ఉద్యోగాల గురించీ, తెలంగాణ బిడ్డలు కోల్పోయిన రెండున్నర లక్షల ఉద్యోగాల గురించీ మాట్లాడడానికి మాత్రం నోరు పెకలలేదు.

ఇంకా హాస్యాస్పదమైన సంగతి: న్యాయమూర్తుల నియామకాలలో జరిగిన అన్యాయాల గురించి తెలంగాణ వాదుల సందేహాల నిజానిజాలు తెలుసుకోవడానికి కమిటీ ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో “పిచ్చాపాటిగా” మాట్లాడిందట. వాళ్లు ఆ దురభిప్రాయానికి తావు లేదన్నారట! (పే. 288). ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినవారి జాబితా హైకోర్టులో దొరుకుతుంది. ఆ న్యాయమూర్తులు ఏ ప్రాంతానికి చెందినవారో సమాచారం కూడ దొరుకుతుంది. ఇంత అధికారికమైన కమిటీ తానే స్వతంత్రంగా ఆ సమాచారం సేకరించి నిర్ధారణకు రావాలని అనుకోలేదు. ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులను కలిసి “పిచ్చాపాటిగా” మాట్లాడిందట. వాళ్లు చెప్పినమాట నిజమే అనిపించిందట. తాను పరిశోధిస్తున్న విషయం పట్ల ఈ కమిటీకి ఉన్న తీవ్రత అదన్నమాట. కనీసం ఆ ఇద్దరు మాజీ న్యాయమూర్తులు ఏప్రాంతానికి చెందినవారో చెపితే సరిపోయేది!!

ఈ అధ్యాయం చివరన, “ఇకముందు ఏమైనా సవరణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందా” అనీ, “ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ అవసరమనే డిమాండ్ సమంజసమైనదేనా” అనీ రెండు ముఖ్యమైన ప్రశ్నలను తానే వేసుకుని కమిటీ జవాబు చెప్పింది. “గత నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం చాల సవరణ చర్యలు తీసుకున్నది గనుక ఇకముందు సవరణ చర్యల అవసరమేమీ లేద”ని నిర్ధారించింది. ఇక రెండో ప్రశ్నకు జవాబుగా ప్రభుత్వోద్యోగులు మొత్తం రాష్ట్ర జనాభాలో1.7 శాతం మాత్రమేననీ, పనిచేసేవారి జనాభాలో 3.6 శాతం మాత్రమేననీ కనుక అది అంత పెద్ద సమస్య కాదనీ (పే. 291) కమిటీ తేల్చి చెప్పింది.

ఇలా ప్రభుత్వోద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ అవసరమా లేదా అనే తప్పుడు చర్చను శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రారంభించింది. కనీస ప్రజాస్వామిక సూత్రాలకు, రక్షణ కోసం విచక్షణ (ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్) అనే రాజ్యాంగ ఆదర్శానికి తూట్లు పొడిచే ఈ చర్చను సాగించడానికి రాజ్యాంగంలోని రెండు అధికరణాల మధ్య పోటీ పెట్టి వాదించే కుటిలత్వానికి కూడ కమిటీ పాల్పడింది. అంతేకాదు, రాజ్యాంగ అధికరణం 16లో చెప్పిన ఉద్యోగావకాశాల సమానత్వం గురించి తన వాదనను బలపరచుకోవడానికి అసందర్భంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగ, శిక్షణా శాఖకు ఒక ఉత్తరం రాసి, వారి జవాబును నివేదికలో భాగం చేసింది. (పే. 255-256)

దేశపౌరులు ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చునని రాజ్యాంగంలోని అధికరణం 16 చెపుతుండగా, తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకే కేటాయించడం కష్టం కావచ్చుననే ఉద్దేశంతోనే ఏడవ రాజ్యాంగ సవరణ జరిగింది. కేంద్ర ప్రభుత్వమే 1957లో ప్రభుత్వోద్యోగాల (స్థానికతా అర్హతల) చట్టం తీసుకు వచ్చింది. ఈ చరిత్రను, తెలంగాణ ప్రత్యేకతను ప్రస్తావిస్తూ కూడ, ఆ ప్రత్యేకత ఆ తర్వాత ఎందుకు కొనసాగలేదనే ప్రశ్నను మాత్రం కమిటీ పక్కనపెట్టింది. ఆ ప్రత్యేక నిబంధనలను ఎప్పటికప్పుడు తొక్కి పడుతూ, ఉల్లంఘిస్తూ, వక్రీకరించి అమలుచేస్తూ వచ్చినందువల్ల, ఆ అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రాంతీయమండలి లేవనెత్తిన అభ్యంతరాలను కూడ తోసివేయడం వల్ల చివరికి 1969లో తెలంగాణ రక్షణల అమలు కోసం తెలంగాణ ఎన్ జీ వో లు ఉద్యమించవలసి వచ్చింది. ఆ ఉద్యమం వల్లనే వచ్చిన జీ ఓ నం 36 కూడ అమలుకు నోచుకోలేదు. ముల్కీ నిబంధనల ఉల్లంఘన ఎడాపెడా కొనసాగుతూనే వచ్చింది. చివరికి 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు న్యాయబద్ధమైనవేనని, వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత, దాన్ని పక్కదారి పట్టించడానికి ఆరు సూత్రాల పథకం తయారుచేశారు. దానిలో ఆరవ సూత్రంగా “పై ఐదు అమలయితే ముల్కీ నిబంధనలు అనవసరమవుతాయి” అని చేర్చి, అందువల్ల ముల్కీ నిబంధనల రద్దు చట్టం తెచ్చారు. ఆరు సూత్రాల పథకం కొనసాగింపుగా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులలో రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, అడగకుండానే తెలంగాణను రెండు జోన్లుగా విడగొట్టి, మిగిలిన రక్షణలనూ, రిజర్వేషన్లనూ వక్రీకరించి, తెలంగాణ బిడ్డలకు న్యాయంగా రావలసిన వాటాను దొంగిలించారు. ఆ దొంగతనాన్ని పది సంవత్సరాల పాటు సహించి, భరించి, చివరికి 1984లో టి ఎన్ జీ వో లు నిలదీస్తే జైభారత్ రెడ్డి కమిటీ వచ్చింది. సుందరేశన్ కమిటీ వచ్చింది. జీవో 610 వచ్చింది. మూడు నెలలలోగా అమలు కావలసిన ఆ జీవో పదిహేను సంవత్సరాలకు కూడ అమలు కాకపోతే మళ్లీ మొదలయిన ఆందోళనలతో శాసనసభా సంఘం, జె ఎం గిర్ గ్లాని కమిషన్ వచ్చాయి. ఆ నివేదికలకు కూడ అతీగతీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ఒక షరతుగా ఉన్న స్థానికులకు ఉద్యోగ రక్షణ అనే నిబంధన 1956లో మొదటిసారి కాగితం మీదికి ఎక్కి, ఆ తర్వాత కనీసం డజను సార్లు పునరుద్ఘాటన జరిగినా అమలుకు మాత్రం నోచుకోలేదు.

ఈ సుదీర్ఘ, విషాద చరిత్రంతా శ్రీకృష్ణ కమిటీకి పట్టనే లేదు. ఈ చరిత్రలో నుంచి తనకు అవసరమైన మేరకు తీసుకుంటూ, తెలంగాణ స్థానికుల ఆకాంక్షల గుర్తింపును నిరాకరిస్తూ నివేదిక రచన సాగింది. మొదటి అధ్యాయంలో రాసిన చరిత్ర లోనూ, ఐదవ అధ్యాయంలోనూ కూడ ఈ ధోరణే సాగింది. కమిటీ నివేదిక పరిష్కారాల విషయంలోనో, ఇతర విశ్లేషణల విషయంలోనో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉండడం ఒక ఎత్తయితే, అసలు ఉద్యమానికి పునాదిగా ఉన్న నియామకాల విషయంలో అన్యాయాలను వాస్తవికంగా గుర్తించకపోవడం, న్యాయబద్ధమైన పరిష్కారాలు సూచించకపోవడం మరొక ఎత్తు. మొత్తానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడంలో పాలకవర్గాలు గత ఆరు దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరికి మరొక నిదర్శనంగా నిలుస్తుంది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక.

నిర్ధారణలకు తగినట్టే సిఫారసులు

ఇంత ఘనమైన పరిశీలనలు, నిర్ధారణలు చేసిన శ్రీకృష్ణ కమిటీ, వాటి మీద ఆధారపడి ‘ఎక్కువ అంగీకారయోగ్యమైన పరిష్కారాలు/అవకాశాలు’ అనే శీర్షిక కింద ఆరు సిఫారసులు చేసింది. ఎక్కువ అంగీకారయోగ్యమైనవనీ, పరిష్కారాలు అనీ, అవకాశాలు అనీ తానే శీర్షిక పెట్టి చెప్పిన ఆరు సిఫారసులలో నాలుగు పనికి రావని మళ్లీ తానే చెప్పింది. “ఎమితిని సెపితివి కపితము, ఎర్రి పుచ్చకాయ తిని సెపితో” అని తెనాలి రామకృష్ణ కవి చేసిన వెటకారానికి కూడ పనికిరానంత తెలివి తక్కువ కపిత్వం ఇది. లేకపోతే తానే పనికిరానని అనుకుంటున్న అంశాలను సిఫారసులుగా ప్రకటించడం ఉచితమని ఏమాత్రం భాష తెలిసిన వాడయినా, ఇంగిత జ్ఞానం ఉన్నవాడయినా అనుకోవడానికి వీలు లేదు.

ఆ ఆరు సిఫారసులలో మొదటిది, యథాతథ స్థితిని కొనసాగించడం. ఈ సిఫారసు అమలు చేస్తే తెలంగాణలో హింసాత్మక ఆందోళనలు చెలరేగుతాయనీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ రాష్ట్ర సమితితో చేతులు కలిపి ఆందోళనలు ఉద్వేగపూరితంగా, తీవ్రంగా మారుతాయనీ కమిటీ రాసింది. రాజకీయ నాయకులమీద ఒత్తిడి పెరిగి ప్రజాప్రతినిధుల రాజీనామాలకు దారితీయవచ్చునని రాసింది. మావోయిస్టు ఉద్యమానికి ప్రోత్సాహం దొరుకుతుందనీ రాసింది. “ఈ సంక్లిష్ట పరిస్థితి వల్ల, తీవ్రతరమైన, సున్నితమైన భావోద్వేగ అంశాలు ఉన్నందువల్ల, సాదాగా యథాతథ స్థితిని కొనసాగించడం అసాధ్యమని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నది. తప్పనిసరిగా ఏదో ఒక జోక్యం చేసుకోవలసిందే. యథాతథ స్థితిని కొనసాగించడం ఒక అవకాశమే అయినప్పటికీ, దాన్ని చిట్టచివరి అవకాశంగానే చూడాలి” అని రాసింది.

ఈ సిఫారసు ఆచరణ సాధ్యం కాదని కమిటీయే ఏకగ్రీవంగా భావించింది కాబట్టి ఇక చెప్పవలసిందేమీ లేదు. కాని ఇక్కడ కూడ తెలంగాణలో వ్యక్తంకాగల ఆందోళన గురించి, మావోయిస్టుల గురించి కమిటీ రాసిన అభిప్రాయాలు దుర్మార్గమైనవి, అనుచితమైనవి.

ఇక రెండవ సిఫారసు, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం; హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి రెండు రాష్ట్రాలూ తమ రాజధానులను కాలక్రమంలో అభివృద్ధి చేసుకోవడం. హైదరాబాద్ ను ఎందుకు వేరుచేయాలో అనేక తప్పుడు వాదనలతో ఈ సిఫారసును సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. కాని చివరికి “ఈ అవకాశం వల్ల తెలంగాణ ప్రజలు మరొకసారి తీవ్రమైన ఆందోళనకు దిగే అవకాశం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ ను తెలంగాణలో భాగంగా ఉంచాలని తెలంగాణవాదులు అడగవచ్చు, దానితో అది కేంద్రపాలిత ప్రాంతంగా పనిచేయడం కష్టతరమవుతుంది … హైదరాబాదు ను తెలంగాణలో అంతర్భాగంగానే ఎల్లప్పుడూ భావించడం జరిగింది గనుక, కొత్త రాష్ట్రంలో అది భాగం కాకపోతే తీవ్రమైన అసంతృప్తి, ఆందోళనలు చెలరేగి సమస్య కొనసాగుతుంది …. అందువల్ల అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ అవకాశం కూడ ఆచరణ సాధ్యం కాదని కమిటీ భావిస్తోంది” అని రాశారు.

ఈ సిఫారసు కూడ ఆచరణ సాధ్యం కాదని కమిటీయే భావించింది గాని, అసలు ఈ ఆలోచన రావడమే కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాల దృక్పథం. దేశ చరిత్రలో జరిగిన ఏ రాష్ట్ర విభజన లోనూ ఒక ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్న రాజధానిని ఆ ప్రాంతం నుంచి విడదీయడం జరగలేదు. అలాగే చారిత్రకంగానే హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. కోస్తాంధ్రకూ, రాయలసీమకూ కనీసం మద్రాసుతో ఉన్నపాటి అనుబంధమైనా హైదరాబాద్ తో లేదు. గత యాభై నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ రాజధానిగా ఉన్నందువల్ల, విద్యా, ఉద్యోగావకాశాలను కేంద్రీకరించే పాలక విధానాల వల్ల తప్పనిసరి అయి ఆ ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ కు రావలసి వచ్చిందేమో గాని అది సొంత ఆస్తి భావన కావడానికి వీలు లేదు. కేవలం హైదరాబాద్ లో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు, ఆస్తులు పోగు చేసుకున్న కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నుల ఇష్టాలను నెరవేర్చడానికే ఈ సిఫారసు చేయడం జరిగింది.

మూడో సిఫారసు: రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర గా విభజించి, హైదరాబాద్ ను రాయల తెలంగాణలో భాగం చేయడం. ఈ ప్రతిపాదనను రాయలసీమలో కొందరు రెండో ప్రతిపాదనగా ముందుకు తెచ్చారట. మజ్లిస్ కూడ ముస్లిం ప్రజల ప్రయోజనాల రీత్యా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండవలసిందేననీ, అలా కాక, విభజన తప్పకపోతే రాయలసీమనూ, తెలంగాణనూ కలపాలని ప్రతిపాదించిందట. మజ్లిస్ ఎందుకు ఆ ప్రతిపాదన పెట్టిందో, ఇతర రాజకీయ పార్టీలు ఆ ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకించవచ్చునో వివరణ ఇచ్చిన తర్వాత, “ఈ ప్రతిపాదనను తెలంగాణ అనుకూలురు గాని, సమైక్యాంధ్ర వాదులు గాని ఒప్పుకునే అవకాశం లేదు. పైగా ఈ ప్రతిపాదన వల్ల ప్రత్యర్థి రాజకీయ పార్టీలలో, వర్గాలలో ఛాందసవాద శక్తులు తలెత్తడానికి వీలు కలుగుతుంది. ఈ సిఫారసుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు కూడ తలెత్తవచ్చు. కనుక ఈ అవకాశానికి ఆర్థిక సమర్థన ఉన్నప్పటికీ, ఈ పరిష్కారం మూడు ప్రాంతాల ప్రజలకూ అంగీకారయోగ్యం కాదని కమిటీ భావిస్తోంది” అని రాసింది.

మూడు ప్రాంతాల ప్రజలకూ అంగీకారయోగ్యం కాదని గుర్తించిన ఈ ప్రతిపాదన సిఫారసు ఎలా అయిందో కమిటీకే తెలియాలి.

నాలుగో సిఫారసు ఆంధ్రప్రదేశ్ ను సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, విస్తరించిన హైదరాబాద్ మహానగరాన్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి నల్లగొండ జిల్లా ద్వారా కోస్తాంధ్రలోని గుంటూరు జిల్లాతో, మహబూబ్ నగర్ జిల్లా ద్వారా రాయలసీమలోని కర్నూలు జిల్లాతో సంబంధం ఉంటుంది. ఈ సిఫారసుకు అనుకూలంగా మూడు వాదనలు చెప్పిన కమిటీ చివరికి “ఈ ప్రతిపాదనకు తెలంగాణ వాదుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావచ్చు. హైదరాబాద్ ను ఎంతో కాలంగా తెలంగాణలో అంతర్భాగంగా చూస్తున్నారు గనుక అన్ని ప్రాంతాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడాన్ని వాళ్లు ఆమోదించలేరు. తెలంగాణకు చెందిన నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను పాక్షికంగా విడదీసి హైదరాబాద్ లో కలపడం వారికి అసంతృప్తి కలిగించవచ్చు. (దీర్ఘకాలికంగా చూస్తే ఇలా కలిపినందువల్లనే వారు అతివేగంగా అభివృద్ధి చెందే అవకాశం వచ్చినప్పటికీ)… ఈ అవకాశంలో కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, దీన్ని అందరికీ ఆమోదయోగ్యం చేయడం, రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం ఇబ్బంది కావచ్చు. ప్రత్యేకంగా తెలంగాణ నుంచి తీవ్రమైన ప్రతిఘటన, ఆందోళన వస్తుందని ఊహించవచ్చు. అలాగే హైదరాబాద్ తో కలిసి అయినా కలవకుండా అయినా తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు విజృంభించే అవకాశం ఉందని దృష్టిలో ఉంచుకోవాలి” అని రాసింది.

హైదరాబాద్ ను తెలంగాణ నుంచి వేరుచేసి, దాన్ని పూర్తిగా కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకూ, దేశదేశాల సంపన్నులకూ, బహుళజాతిసంస్థలకూ అప్పగించడానికి పన్నిన కుట్ర ఇది. పైగా అటు కోస్తాకూ ఇటు రాయలసీమకూ హైదరాబాద్ తో కారిడార్ లు ఏర్పాటు చేయడమంటే దేశంలో ఏ నగరానికీ లేని ప్రతిపత్తిని కల్పించడమైనా కావాలి, తెలంగాణ ప్రజలు పొరుగురాష్ట్రాల ప్రజలను తమ రాష్ట్రంలో తిరగనివ్వరనే దురభిప్రాయం కల్పించడానికైనా కావాలి. తెలంగాణ ప్రజలు అటువంటి ఉద్దేశంతోనే ఉంటే, రాజ్యాంగంలోని మూడో అధికరణాన్నీ, కేంద్ర హోం మంత్రి డిసెంబర్ 9 ప్రకటననూ గౌరవించి ఉండేవాళ్లే కాదు.

ఐదవ సిఫారసు రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రలుగా ప్రస్తుత సరిహద్దుల ప్రకారమే విభజించడం, హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగానే ఉంచి, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం. ఈ సిఫారసు పైకి చూడడానికి తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది గాని, లోపలికి వెళితే తెలంగాణకు వ్యతిరేకమైన వ్యాఖ్యలెన్నో ఉన్నాయి. తెలంగాణలోనే ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అకాంక్ష ఉన్నదో, ఎక్కడ ప్రజలు తటస్థంగా ఉన్నారో, ఎక్కడ తెలంగాణ కోరుకోవడం లేదో, కమిటీ ఒక విచిత్రమైన వివరణ ఇచ్చింది. బలమైన తెలంగాణ అనుకూల శక్తులు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో కాక, ఖమ్మం పశ్చిమ ప్రాంతంలో, ఆదిలాబాద్ దక్షిణ ప్రాంతంలో, మెదక్ లో సిద్ధిపేట ప్రాంతంలో, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డిలలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయట. ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, న్యాయవాదులు, ప్రభుత్వోద్యోగులలో ఎన్జీవోలు మాత్రమే బలంగా వ్యక్తీకరిస్తున్న ఆందోళనకారులట.

మిగిలిన సిఫారసులలో ప్రతికూల అంశాలను అరకొరగా ప్రస్తావించి వదిలేయగా, ఈ సిఫారసు కింద మాత్రం ప్రతికూల అంశాలు ఎంత బలమైనవో కమిటీ ఎంతగా నొక్కి చెప్పిందంటే, ఈ సిఫారసును అమలులోకి తేవడం కమిటీకే ఇష్టం లేదని అనిపిస్తుంది. ఒకవైపున “అనివార్యమయితేనే, మూడు ప్రాంతాల ప్రజలు శాంతియుతంగా అంగీకరిస్తేనే ఈ సిఫారసును అమలు చేయాలి” అని ఆటంకాలు తానే కల్పించింది. అయినా ఈ సిఫారసు అమలు చేస్తారేమో అన్నట్టుగా, ఇది అమలు చేస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు కూడ సూచించింది.

ఆరవ సిఫారసుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ సాధికారత కల్పనకు రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. చట్టపరమైన అధికారం ఉన్న తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పరచాలని సూచించింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తితో ఈ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని అంది. తెలంగాణ ప్రాంతీయ మండలికి ఏ అధికారాలు ఉండాలో, ఏ అధికార పరిధి ఉండాలో కూడ ప్రతిపాదించింది.

ఈ సిఫారసు తయారీలో సంపూర్ణమైన దగుల్బాజీతనం కనబడుతోంది. ముందు వందల పేజీలు తెలంగాణ సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించిందనీ, ఆ కారణం మీద రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదనీ వాదించిన కమిటీ అదంతా మరిచిపోయి, హఠాత్తుగా తెలంగాణ ప్రాంతపు సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధ రక్షణలు కావాలని రాస్తోంది. ఈ మాట రాయడంలో మరొక ముఖ్య విషయం కూడ మరచిపోయింది. తెలంగాణ రక్షణల కోసమే ఇప్పటికి రెండు రాజ్యాంగ సవరణలు (మొదటిసారి 1956లో అధికరణం 371 చేర్చిన ఏడవ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత 1974లో ఆ అధికరణం నుంచి ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని తొలగించి, అదనంగా అధికరణం 371-డి చేర్చిన ముప్పైరెండవ రాజ్యాంగ సవరణ) వచ్చాయి. మొదటి సవరణతో ఏర్పడిన ప్రాంతీయ కమిటీ రెండో సవరణతో రద్దయింది. ఇప్పుడు మళ్లీ ఆచరణలోకి రావాలని శ్రీకృష్ణ కమిటీ కోరుతున్న ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి అప్పుడే తూట్లు పొడిచారు. ఆ తర్వాత కూడ రక్షణకు ఉద్దేశించిన చర్యలు ఎన్నో జరిగాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఎన్నో వచ్చాయి. వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు గనుకనే, రాజ్యాంగబద్ధమైన హామీలు కూడ అమలు కాలేదు గనుకనే, అమలు చేయాలనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాలకు లేదు గనుకనే, రాష్ట్ర విభజన తప్ప గత్యంతరం లేదు అని తెలంగాణ సమాజం నినదిస్తోంది, సంఘటితమవుతోంది, పోరాడుతోంది.

కమిటీ దృక్పథం – శాంతి భద్రతల సమస్య

జనవరి 5, 2010 సమావేశం నుంచే, ఆ మాటకు వస్తే 2009 డిసెంబర్ 29న రాష్ట్ర గవర్నర్ గా చత్తీస్ ఘడ్ లో నరమేధానికి రూపకర్తలలో ఒకరైన మాజీ పోలీసు అధికారిని నియమించినప్పటి నుంచే మొత్తం తెలంగాణ అంశాన్ని శాంతిభద్రతల సమస్యగా చూపి దమననీతిని అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర పాలకులు నిర్ణయించుకున్నారు. ఆ శాంతిభద్రతల దృక్పథాన్ని పుణికి పుచ్చుకున్న కమిటీకి కార్యదర్శిగా మాజీ హోంశాఖ కార్యదర్శిని నియమించారంటేనే, కమిటీలోని న్యాయ, అర్థశాస్త్ర, సామాజికశాస్త్ర నిపుణులకన్న ఎక్కువ పాత్ర పోలీసు దృక్పథానికి ఉండాలని నిర్ణయించారన్నమాట. సరిగ్గా ఆ దృక్పథానికి నిదర్శనంగానే నివేదికలో ఎనిమిదో అధ్యాయం తయారయింది.

హోం మంత్రిత్వ శాఖ బైట పెట్టిన నివేదికలో మిగిలిన అధ్యాయాలన్నీ ఒక్కొక్కటి యాభై పేజీల పైన ఉండగా ఈ ఎనిమిదో అధ్యాయం (పే. 423) కేవలం ఒకే ఒక్క పేజీకి, ఆరంటే ఆరు వాక్యాలకు పరిమితమైంది. కమిటీ తన పనిలో భాగంగా తక్షణ శాంతి భద్రతల సమస్యను, మావోయిస్టు/నక్సల్ కార్యకలాపాల పెరుగుదలతో సహా దీర్ఘకాలిక అంతర్గత భద్రతా పర్యవసానాలను పరీక్షించిందట. రాజకీయ పార్టీలు, ఇతర బృందాలు సమర్పించిన విజ్ఞాపనలలో ఈ భయాలు వ్యక్తమయ్యాయట. కమిటీ జిల్లాలను, గ్రామాలను సందర్శించినప్పుడు, విభిన్న భాగస్వామ్య శక్తులతో మాట్లాడినప్పుడు కూడ ఈ భయాలు వెలువడ్డాయట. “వీటన్నిటితోపాటు, (పదిహేడు జిల్లాలలో) రాష్ట్రప్రభుత్వానికి, పోలీసు శాఖకు, స్థానిక అధికారవర్గానికి చెందిన సీనియర్ అధికారులతో కమిటీ కార్యదర్శి ముఖాముఖి చర్చలు జరిపారు. ఇతర వర్గాలనుంచి కూడ అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఒక నోట్ తయారు చేసి, హోం మంత్రిత్వ శాఖకు ఒక ప్రత్యేకమైన కవర్ లో విడిగా సమర్పిస్తున్నాం. ‘ముందడుగు’ అనే తొమ్మిదో అధ్యాయం లో పరిష్కారమార్గాలను చర్చించేటప్పుడు కమిటీ ఈ కోణాలను దృష్టిలో పెట్టుకుంది” అని నివేదికలో ఈ అధ్యాయం ముగుస్తుంది.

ఇందులో మూడు దుర్మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఒక బహిరంగ ప్రజావిచారణ జరిపిన కమిటీ, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన కమిటీ, తన నివేదికలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ఇలా రహస్యంగా ఉంచడం ఉచితమేనా? ఒకవైపు ప్రభుత్వాలు ప్రజల నుంచి ఏ విషయాన్నీ దాచడానికి, రహస్య సమాచారంగా ప్రకటించడానికి వీలులేదని ప్రపంచ వ్యాప్తంగానే వికీలీక్స్ వంటి పరిణామాలు జరుగుతుంటే, ప్రజాస్వామిక భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటువంటి రహస్యానికి ఒడిగట్టడం సమంజసమేనా?

రెండు, కమిటీ మధ్య సాధ్యాసాధ్యాలనుబట్టి పని విభజన జరగవచ్చు గాని, ఒక ముఖ్యమైన అధ్యాయానికి, వారే చెప్పినట్టు పరిష్కార మార్గాలకు పునాది అయిన అధ్యాయానికి అవసరమైన అతి ముఖ్యమైన సమాచార సేకరణ బాధ్యత ఐదుగురిలో ఒక్కరికే ఎలా ఇస్తారు? ఆ ఒక్కరు తెచ్చిన సమాచారమంతా యథాతథంగా స్వీకరించగలిగినదేనని, ఆయన తన ఇష్టాయిష్టాల ప్రకారమో, ఇతరుల ఒత్తిడితోనో ఆ సమాచారాన్ని మార్చి ఉండవచ్చుననే అనుమానం మిగిలిన సభ్యులకు రాలేదా?

మూడు, ఈ అధ్యాయంలోని విషయాలే పరిష్కార మార్గాలను తయారు చేయడానికి ఉపయోగపడ్డాయని కమిటీయే అభిప్రాయపడినప్పుడు, ఆ మార్గాలను మాత్రం బయటపెట్టి, ఆ మార్గాలకు రావడానికి దారితీసిన కారణాలను ప్రజలనుంచి దాచిపెట్టడం ఉచితమా? సమంజసమా? మధ్యవర్తిత్వంలో, న్యాయవిచారణలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా?

ఈ దాచిపెట్టిన ఎనిమిదో అధ్యాయాన్ని అలా ఉంచి, అసలు మొత్తం నివేదికలోనూ, సిఫారసులలోనూ ఎన్నో చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా శాంతిభద్రతల గురించి, అంతర్గత భద్రత గురించి, మావోయిస్టుల గురించి, ఇస్లామిక్ తీవ్రవాదుల గురించి, విద్యార్థుల హింసాత్మక చర్యల గురించి కమిటీ మాట్లాడింది. ఇది అచ్చంగా ఈ దేశంలో పాలకవర్గాల దృక్పథం. ప్రజలు తాము అనుభవిస్తున్న ఏ సమస్య గురించి మాట్లాడినా శాంతిభద్రతలకు భంగం వాటిల్లినట్టే పాలకవర్గాలకు అనిపిస్తుంది. ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత, అవినీతి, ఆధిపత్యం, కుల అణచివేత, వనరుల దోపిడీ – ఏ సమస్య అయినా సరే, ప్రజలు ఆ సమస్యలను పాలకుల ముందుకు తెచ్చి, పరిష్కరించమని కోరితే చాలు, అవి శాంతిభద్రతల సమస్యలుగా మారుతాయి. వాటికి లాఠీలతో, తూటాలతో, నిర్బంధంతో జవాబు చెప్పక తప్పదని పాలకులు అనుకుంటారు. ప్రజలు లేవనెత్తే సమస్యలు మాత్రమే కాదు, చివరికి పాలకులు తామే రాసుకున్న రాజ్యాంగాన్నీ, చట్టాలనూ, చేసిన వాగ్దానాలనూ పాటించాలని ఎవరు కోరినా శాంతి భద్రతల సమస్యగా కనబడే స్థితికి ఇవాళ పాలకులు చేరుకున్నారు.

ఈ శాంతి భద్రతల దృక్పథంలో భాగమే బాధిత ప్రజల హక్కులపట్ల ఎటువంటి సున్నిత భావాలు లేకపోవడం. తమ హక్కుల కోసం ప్రశ్నించే క్రమంలో ప్రభుత్వ దమనకాండలో గాని, నిరాశానిస్పృహలకు లోనై తమంత తామే గాని చనిపోయే, గాయపడే, నష్టపోయే ప్రజల గురించి ఈ శాంతిభద్రతల పాలకులకు పట్టనే పట్టదు. అందుకే 1969 ఉద్యమం సందర్భంగానూ, 2009-10 ఉద్యమంలోనూ జరిగిన అశాంతి గురించి, ఆస్తి నష్టం గురించి, హింస గురించి, విధ్వంసం గురించి మాట్లాడిన కమిటీ అప్పుడు తుపాకి తూటాలకు బలి అయిన 370 మంది విద్యార్థి యువజనుల గురించి గాని, ఇప్పుడు నిరాశతో ఆత్మహత్య చేసుకున్న 600 మంది గురించి గాని ఒక్క సానుభూతి వాక్యం రాయలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక శాంతి భద్రతల పాలకనీతితో తయారయింది. అయితే, హోం శాఖ కార్యదర్శిగా పని చేసిన కమిటీ కార్యదర్శికి ఇటువంటి పాలకనీతి వంటబట్టడంలో ఆశ్చర్యమూ అసహజమూ ఏమీ లేదు. కాని ఒక చర్యను నేరంగా భావించేటప్పుడైనా ఆ నేరం ఎలా జరిగిందని ఆలోచించాలని శిక్షణ పొందిన న్యాయకోవిదులు, ఒక సామాజిక చర్య ఏ నేపథ్యంలో సంభవించిందో అధ్యయనం చేయడంలో శిక్షణ పొందిన సామాజిక శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కూడ ఈ పాలకనీతిని ఔదల దాల్చడమే విషాదకరం. మన మేధావివర్గం ప్రజలకు దూరంగా, పాలకులకు దగ్గరగా ఎలా ప్రయాణిస్తున్నదో ఈ నివేదిక కొట్టవచ్చినట్టుగా చూపుతోంది.

కమిటీ దృక్పథం – అభివృద్ధి మాయాజాలం

కమిటీ ఇటువంటి వైఖరిని తీసుకోవడానికి కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల, ఆంధ్రప్రదేశ్ పాలకవర్గాల దృక్పథం మాత్రమే కాక, దేశ పాలకవర్గాల, ప్రపంచీకరణ శక్తుల దృక్పథం కూడ కారణం. ఈ రెండు దృక్పథాలూ అభివృద్ధి మాయాజాలంలో సమైక్యమయ్యాయి. అభివృద్ధి పేరుతో ప్రజలను మాయ చేయడం, ఆ మాయ చాటున తమ ప్రయోజనాలను కొనసాగించుకోవడం, పెంచుకోవడం పాలకవర్గాలకు, సంపన్నవర్గాలకు ఎంతోకాలంగా అలవాటే. 1947 నుంచీ కూడ దేశంలో అమలవుతున్న పాలకనీతి అదే. ఆ పాలకనీతి 1980లమధ్య వరకూ కనీసం ప్రజల పేరు తలుస్తూ ఉండేది. ఆ తర్వాత, మరీముఖ్యంగా 1991 తర్వాత ప్రపంచీకరణ భావజాలంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్నదిదే. ప్రజలను నిరాశ్రితులను చేయడం, ప్రజల ఉపాధి పోగొట్టడం, ప్రజల ఉమ్మడి వనరులను కొల్లగొట్టడం – అదంతా దేశాభివృద్ధికి అవసరమని, మొదట దేశం అలా అభివృద్ధి చెందితే అది ప్రజలకు ఎప్పటికో ఒకప్పటికి ప్రయోజనం కలిగిస్తుందని ఈ భావజాలం ప్రచారం చేస్తుంది. ఈ భావజాలానికి అసమానతలు కొనసాగాలి. ఒక వర్గం, ఒక ప్రాంతం, ఒక దేశం లాభపడడానికి మరొక వర్గం, మరొక ప్రాంతం, మరొక దేశం నిరంతరం దోపిడీ పీడనలకు గురవుతూ లోబడి, పెరడుగా, వలసగా ఉండాలి. ఇది సహజమైన, అనివార్యమైన స్థితి అని, ఇదే అభివృద్ధి అని నమ్మించడానికి ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేయాలి. ఆ అబద్ధాలలో భాగమే ఈ నివేదిక. అందుకే ఈ నివేదిక అతి ఎక్కువ భాగం అంకెల భాషలో, మార్కెట్ భాషలో, హైదరాబాద్ ఆకర్షిస్తున్న సేవారంగ సంస్థల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల భాషలో, సంపన్నుల సంపదను మరింత పెంచే, పేదలను మరింత పేదరికంలోకి తోసే విధానాల భాషలో మాట్లాడింది. ఇవాళ దేశ పాలకవర్గాలకు నాయకత్వం వహిస్తున్న డా. మన్మోహన్ సింగ్, అంతకుముందు బహుళజాతిసంస్థల న్యాయవాదిగా, ఆ తర్వాత వాణిజ్య, ఆర్థిక శాఖల మంత్రిగా ఉండి ప్రస్తుతం పోలీసు మంత్రిగా మారిన చిదంబరం నమ్మే భావజాలం ఇదే.

పనికొచ్చేది ఏమీలేదా?

నివేదిక తయారీలో భాగంగా ప్రజలను కలవడం జరిగింది కాబట్టి, ఎంత దుర్మార్గంగా తయారయిన నివేదికలోనైనా ప్రజల ఘోషకు బలహీనమైన ప్రతిధ్వనులైనా వినిపించక తప్పదు. అలా ఈ నివేదికలో కూడ అతి జాగ్రత్తగా వెతికితే కనబడే నాలుగైదు పనికొచ్చే అంశాలున్నాయి.

• పే. 73లో రైతులకు అందుతున్న రుణ సౌకర్యాల గురించి మాట్లాడుతూ కోస్తాంధ్రలో అది హెక్టారుకు రు. 32 వేలుగా ఉండగా, రాయలసీమలో రు. 21 వేలుగా, తెలంగాణలో రు. 18 వేలుగా ఉందని కమిటీయే రాసింది. ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించడం మాత్రం చేయలేదనేది వేరే సంగతి.

• పే. 121లో రాష్ట్రం మనగలగడానికి ఉండే ఆర్థిక పరిమాణం గురించి రాస్తూ, “కేవలం ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని మాత్రమే చూస్తే, ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణ హైదరాబాదుతో కలిసిగాని, హైదరాబాదు లేకుండా గాని మనగలుగుతుంది. ఇతర ప్రాంతాల సమ్మేళనం – కోస్తాంధ్ర, రాయలసీమలు కలిసిన రాష్ట్రం కూడ మనగలుగుతుంది. నిజానికి ఆ రెండు ప్రాంతాలూ విడి విడి రాష్ట్రాలుగా కూడ మనగలుగుతాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలనే నిర్ణయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి తటస్థ పాత్రనే వహిస్తుంది” అని రాసింది.

• పే 207 – 209లో తెలంగాణ లేవనెత్తిన నీటి పారుదల ఫిర్యాదులలో కొన్ని వాస్తవమేనని కమిటీ అంగీకరించింది.

• “ఉప ప్రాంతీయ వాదం కులం, భాష వంటి ఎక్కువ మౌలికమైన ఆదిమ అస్తిత్వాల మీద ఆధారపడిన ఉద్యమం కాదు. అది ప్రధానంగా ఆధునికమైనది. సమతుల్యమైన, సమానమైన ఆధునికత దిశలో సాగేది. మా విశ్లేషణలో కులం, మతం, స్త్రీ పురుష భేదం, ఇతర విభజనలనన్నిటినీ అధిగమించిన తెలంగాణ ఉద్యమం ప్రాంతం మొత్తానికీ అబ్భివృద్ధి కావాలనే ఆకాంక్షను వెలిబుచ్చుతోంది. ప్రాంతీయ వనరుల మీద, వాటిని అందుబాటులోకి తెచ్చుకోవడం మీద దృష్టి సారిస్తోంది. ఇంకా చెప్పాలంటే, అది హక్కుల ఆధారిత అభివృద్ధి దృక్పథాన్ని ముందుకు తెస్తోంది. ఈ దృక్పథంలో ఒక విశాల సమానత్వ అభివృద్ధి లో భాగంగానే బృందాలూ, సమూహాలూ తమ కార్యక్రమాలను ముందుకు పెడతాయి” అని నివేదిక విశ్లేషించింది.(పే. 357)

• “తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పాలనా ప్రాంతంలో ఇతోధిక ప్రజాస్వామ్యం కొరకు, సాధికారత కొరకు సాగుతున్న ఉద్యమంగా వ్యాఖ్యానించవచ్చు” అని కమిటీ రాసింది (పే. 413). దీనికి కొనసాగింపుగా పే. 357లో చేసిన విశ్లేషణను మళ్లీ ఒకసారి రాసింది.

• “తెలంగాణలో ప్రాంతీయ భావోద్వేగాలు ప్రబలంగా ఉన్నాయి. అవి కుల, తెగ, మత అస్తిత్వాలనూ, సామాజిక వర్గ బృందాలనూ అధిగమించి ఉన్నాయి” అని కమిటీ రాసింది (పే. 414)

• అన్నిటి కన్నా ముఖ్యంగా కమిటీ చేసిన సిఫారసులన్నీ ఆంధ్రప్రదేశ్ ను యథాతథంగా కొనసాగించడం అసాధ్యం అని చెప్పకనే చెప్పాయి. మొదటి సిఫారసు యథాతథం అని మాట మాత్రం అన్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కాదని ఏకగ్రీవంగా అభిప్రాయ పడినట్టు కమిటీయే రాసింది. మిగిలిన ఐదు సిఫారసుల సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, అవన్నీ ఆంధ్రప్రదేశ్ యథాతథంగా ఉండడం కుదరదు అని ప్రకటిస్తున్నాయి.

ముగింపు

ఇది రాస్తున్నంతసేపూ ఇంత విషపూరితమైన, అమానుషమైన, క్రూరమైన, ప్రజావ్యతిరేకమైన నివేదికను, ఈ అశుద్ధాన్ని ఇలా పరీక్షించవలసి వచ్చిందిగదా అని అసహ్యం, ఆగ్రహం కలిగాయి. ప్రజలను ఇంతగా మోసం చేస్తున్న పాలకవర్గాల మీద, పాలకనీతి మీద అసహ్యం, ఆగ్రహం పెరిగిపోయాయి. ఈ దేశంలో పాలకవర్గాలు, అధిపత్యవర్గాలు, ఇతరుల వనరులను, అవకాశాలను కొల్లగొడుతున్న వర్గాలు తమ అక్రమాలు, దోపిడీ పీడనలు కొనసాగడానికి ఎటువంటి అబద్ధాలకు దిగజారుతాయొ అడుగడుగునా కనబడి ఇదంతా ప్రజలు తెలుసుకోవాలనే తపనతోనే ఇది రాయక తప్పలేదు. తెలంగాణ ప్రత్యర్థులు ఎంత బలమైనవారో, ఎంత వంచకులో, ఎంత దుర్మార్గులో, ఎంత అమానుషమైనవారో శ్రీకృష్ణ నివేదిక బయటపెట్టింది. స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ ప్రత్యర్థులు అంటే కోస్తాంధ్ర, రాయలసీమ సాధారణ ప్రజలు కాదు. ఈ నివేదిక ఆ తెలంగాణేతర ప్రాంతాల ప్రజలకు మేలు చేసేది కూడ కాదు. అసలు ఒక చోట ప్రజలకు ద్రోహం చేసేవారు మరెక్కడయినా ప్రజలకు మేలు చేయలేరు. ఇది కేవలం కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకు, భూస్వాములకు, పెట్టుబడిదారులకు, రాజకీయ వ్యాపారులకు, ప్రజావ్యతిరేకులకు మేలు చేసే నివేదిక మాత్రమే. వారి నివేదిక మాత్రమే. వారికి మద్దతు ఇస్తున్న దేశ పాలకవర్గాల, ప్రపంచీకరణ శక్తుల నివేదిక మాత్రమే. వారికి రక్షణ కల్పిస్తూ ప్రజల మీద దౌర్జన్యం చలాయిస్తున్న పోలీసుల, భద్రతా బలగాల నివేదిక మాత్రమే. అందువల్ల ఈ నివేదికను వ్యతిరేకించడం, ఎండగట్టడం, ప్రతిఘటించడం తెలంగాణ ప్రజల బాధ్యత మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్నీ, రాజ్యాంగ స్ఫూర్తినీ, చట్టబద్ధ పాలననూ, ప్రాథమిక హక్కులనూ, వనరుల మీద భూమిపుత్రుల హక్కునూ గౌరవించే, ప్రేమించే, పరిరక్షించాలని కోరుకునే ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుంది. నా ఈ రచన కూడ ఆ బాధ్యతలో భాగమే.
***
చదవదగిన పుస్తకాలు

నివేదిక మీద అదనపు వ్యాఖ్యలకు, వివరణలకు, విమర్శలకు ఈ కింది పుస్తకాలు, కరపత్రాలు కూడ చదవడం ఉపయోగకరం:
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్) – విద్యుత్ రంగంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక – ఒక అబద్ధాల పుట్ట.
సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ – దగాపడ్డ తెలంగాణకు శ్రీకృష్ణ కమిటీ దోఖా.
ఎస్ విజయ కుమార్ (సం.) – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దగాపడ్డ తెలంగాణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, హైదరాబాద్ ఇంజనీర్ల సంఘం, తెలంగాణ అసెస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం ప్రచురణ.
Telangana Development Forum – USA/India & Telangana Vidyavanthula Vedika – Justice Srikrishna’s Injustice.
తెలంగాణ రిసోర్స్ సెంటర్ – ప్రజల్ని విస్మరించిన శ్రీకృష్ణ నివేదిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *