mt_logo

రాజకీయ అమీబా ఈ నాగభైరవుడు

లోక్ సత్తా అధినేత నాగభైరవ జయప్రకాశ్ నారాయణను మేం ఇదివరకోసారి ఊసరవెల్లి అని విమర్శించాం. అప్పుడాయన ఫ్యాన్స్ కొందరు తెగ బాధ పడ్డారు. భక్తులను అజ్ఞానంలో ముంచి తమకేదో అతీంద్రియ శక్తులు ఉన్నట్టు నమ్మించే బాబాలతోనూ నాగభైరవుడిని పోల్చాం. అప్పుడూ కొందరు భక్తులు గుండెలు బాదుకున్నారు.

కానీ ఆయన ఇటీవలి చేష్టలు చూస్తుంటే మాకు ఆయనను దేనితో పోల్చాలో కూడా అర్థం కావట్లేదు. బాగా అలోచించిన పిమ్మట  నాగభైరవుడిని అమీబాతో పోలిస్తే సరిగా సరిపోతుందని అనిపించింది మాకు.

ఎందుకంటారా?

ఒకసారి వికీపీడియా చదవండి:

“అమీబా ఒక ఏకకణ జీవి. పాతతరం ప్రకృతివాదులు అమీబాను “ప్రొటియస్ ఎనిమల్ క్యూల్” అని సంబోధించేవారు. గ్రీకుల దేవత “ప్రొటియస్” తన రూపాన్ని అనేకరకాలుగా మార్చుకునేవాడని, అతని పేరుమీద ఈ జీవికి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత Bory de Saint-Vincent ఈ జీవికి “అమీబా” అను పేరు పెట్టాడు. గ్రీకు భాషలో అమీబా, అనగా “మార్పు”.

చిత్రంగా అమీబాకు ఉన్న అన్ని లక్షణాలూ లోక్ సత్తా అధినేతకు ఉన్నాయి. లోక్ సత్తా ఒక  ఏకవ్యక్తి పార్టీ. దానికి శాసనసభలో ఉన్నది కూడా ఒక్కడే ఎమ్మెల్యే. ఇక అమీబాలాగానే నాగభైరవుడు కూడా తన రాజకీయ రూపాన్ని అనేక విధాలుగా మార్చుకుంటుంటాడు. అమీబా లాగానే ఈయన కూడా “మార్పు”కు పర్యాయపదం అని అనుకుంటుంటాడు.

జీవితాంతం కమ్యూనిస్టులను, మార్క్సిస్టులను “అభివృద్ధి నిరోధకులని” తిట్టిపోసిన నాగభైరవుడు ఈమధ్య యూ-టర్న్ తీసుకుని రెండు “ఎర్ర” పార్టీలతో చర్చలు జరిపి అందులో మార్క్సిస్టులతో ఏకంగా ఎన్నికల పొత్తే ప్రకటించేశాడు. ప్రపంచబ్యాంకు ప్రవచించే సరళీకృత ఆర్ధిక విధానాలకు కొమ్ముకాసే ఫక్తు క్యాపిటలిస్టు, ఏకంగా మార్క్సిస్టు పార్టీతో జట్టుకట్టడం ప్రపంచ రాజకీయల్లోనే ఒక వింత పరిణామం కావచ్చు.   సారుగారి యూ-టర్న్ ను మింగలేక, కక్కలేక పాపం ఆయన ఆన్ లైన్ భక్తజనం ఈరోజుకీ చస్తున్నారు.

నిన్న ఆయన తమ పార్టీకి తెలంగాణలో మిగిలి ఉన్న కార్యకర్తల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతు ఇస్తున్నట్టుగా కనిపించే ప్రకటన ఒకటి చేశాడు.

డిసెంబర్ 9 ప్రకటన వచ్చాక హుటాహుటిన డిల్లీ వెళ్లి “మీరొక ప్రకటన చేశారు కాబట్టే ఇంత గొడవ జరుగుతోంది, ఇంకొక ప్రకటన చేస్తే గొడవ సద్దుమణుగుతుంది” అని మన్మోహన్ సింగ్ చెవిలో ఊదివచ్చి, తదనంతరం నికృష్ట కమిటీ వేసేటట్టు అయిడియా ఇచ్చాడు నాగభైరవుడు. ఒక యేడాదిపాటు ప్రతి వేదిక మీదా తెలంగాణపై విషం చిమ్మిన ఆయన ప్రజల్లో ఉన్న ప్రబల ఆకాంక్షకు జడిసి తరువాత ఒక కొత్త పాట అందుకున్నాడు. “తెలంగాణ ఏర్పాటు అనేది ఉపద్రవమూ కాదు, అది అన్ని సమస్యలను తీర్చే సర్వరోగ నివారిణీ కాదు” అనే ఈ వింత వైఖరితో ఒక యేడాది గడిపాడు. రెండు ప్రాంతాల్లోని పార్టీ శాఖలకు  తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టే “స్వతంత్రం” ఇచ్చి రెండు నాలుకల విధానం కొంతకాలం కొనసాగించాడు. ఇవేవీ పారకపోవడంతో మొన్నటి ఉప ఎన్నికల్లో “నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు” “తెలంగాణ వస్తే స్వాగతిస్తాను” అనే బూటకపు నినాదాలు తీసుకున్నాడు.

అయితే అంతమాత్రాన నాగభైరవుడు మారుమనసు పొందాడని ఎవరైన వెర్రివెంగళప్పలు అనుకుంటే అది తప్పని ఆయనే నిరూపించాడు.

మొన్న మహబూబ్ నగర్ ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ ముస్లిం అభ్యర్ధిని నిలబెడితే అతడిని ఓడగొట్టే ఉద్దేశ్యంతో ఎక్కడో హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఉంటున్న ఒక ముస్లిం విద్యావేత్తను తీసుకువచ్చి మరీ ముస్లిం ఓట్లు చీలిపోయేలా చూశాడు. రాష్ట్రంలో ఎన్నో స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే లోక్ సత్తా ఒక్క మహబూబ్ నగర్లోనే ఎందుకు పోటీ చేసిందో బహిరంగ రహస్యమే.

ఇలా పైకొక మాట, లోపలొక ఆలోచనతో నెట్టుకొస్తున్న ఈ లోక్ సత్తా లీడర్ నిన్న తెలంగాణపై మరొక ప్రహసనానికి తెర తీశాడు.

“ప్రజాస్వామ్యంలో ప్రజల అకాంక్షలు ఎక్కువకాలం గౌరవించకపోవడం మంచిది కాదని, సమగ్ర చర్చతో సామరస్యంగా వచ్చే తెలంగాణకు లోక్ సత్తా పార్టీ అనుకూలం” అని పార్టీ శ్రేణులు చాటాలట.

అబ్బో! పొద్దున లేస్తే ప్రజాస్వామ్యం గురించి లెక్స్చర్లు దంచే నాగభైరవ జయప్రకాశ్ నారాయణకు ఎంత త్వరగా జ్ఞానోదయం అయ్యింది! ప్రజల ఆకాంక్షలు గౌరవించాలని ఇప్పుడు వెలిగిందా సార్ మీకు? బలవంతపు విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలుగా పోరాటం చేస్తుంటే, ఆ మహత్తర పోరాటాన్ని చూడ నిరాకరించడమే కాదు దాన్ని అవహేళన చేసిన మేధావికి ఇప్పుడు జ్ఞానోదయమయ్యిందా?

ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో వివక్షకు, అవమానాలకు గురై స్వరాష్ట్రం కొరకు ఆంధ్ర ప్రజలు ఉద్యమించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండును పరిశీలించడానికి ఒక కమిటీని వేసింది.

జవహర్ లాల్, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో కూడిన ఆ కమిటీ (JVP) “ప్రజానీకంలో అత్యధికులు స్వరాష్ట్రం కావాలని గట్టిగా కోరుకుంటే ప్రజాస్వ్యామ్యవాదులుగా దానిని మనం గౌరవించాల్సి ఉంటుంది” అని అంటూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందిగా సిఫారసు చేసింది.

అది యాభై ఏళ్ల నాటి మాట. ఈ మేధావిగారికి ఇంత చిన్న విషయం అర్థం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కళ్లముందే ఒక ప్రజాస్వ్యామ్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే దానిని కళ్లుండీ చూడలేని కబోధిలా మారడం, తన కుల, వర్గ ప్రయోజనాలను కొమ్ముకాసే ఉద్దేశ్యంతో తెలంగాణా వ్యతిరేక ఉద్యమానికి ఊతమివ్వడం, డిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు రచించడం, తీరా తాను వేయించిన శ్రీకృష్ణ కమిటీ ఒక కుట్రపూరితమైన  రహస్య ఎనిమిదో అధ్యాయం రాస్తే తేలుకుట్టిన దొంగలా మిన్నకుండటం – ఇవి అసలు నాయకత్వ లక్షణాలేనా?.

అయినా ఒక వంక పచ్చి తెలంగాణ వ్యతిరేక మార్క్సిస్ట్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని మరోవంక మేము తెలంగాణకు మద్ధతు అంటే నాగభైరవుడిని నమ్మేవారెవరు?

కొత్త రాజకీయాల గురించి, మార్పు గురించి ఊదరగొట్టే నాగభైరవ జయప్రకాశ్ నారాయణకు నిజంగా తాను మాట్లాడే అంశాలపై చిత్తశుద్ధి ఉండుంటే  ఆయన రాష్ట్ర విభజన అంశంలో ఇంకోలా వ్యవహరించి ఉండేవాడు.

సమాజంలో తనకు మేధావిగా ఉన్న గుర్తింపును, డిల్లీ పెద్దల వద్ద తనకున్న ప్రాబల్యాన్ని ఉపయోగించి తెలుగు ప్రజల మధ్య ఒక సామరస్యపూర్వక విభజనకు తానే ఒక మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. స్వయంగా సీమాంధ్ర ప్రాంతం వాడైనా ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి విభజన సందర్భంగా వచ్చే అనేక చిక్కుముడులను, పంపకాల సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించే అవకాశం ఆయనకు ఉండింది. అలాంటి ఒక పెద్దమనిషి పాత్రను ఆయన పోషించి ఉంటే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేది.

కానీ పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది మరొకటి అనే ఫక్తు రాజకీయ నాయకుడిలాగానే ఆయన ఉండదలిచాడు. రాజకీయాలను మార్చడం కన్నా, తను, తన పార్టీ గాలివాటుగా మారడమే కొత్త రాజకీయం అనుకుంటున్నాడు కాబట్టే ఆయన పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా కొనసాగుతోంది. ఇది మింగుడుపడక ఈమధ్య “మీకు అవసరం లేకపోతే చెప్పండి పార్టీని మూసేస్తాం” అని కూడా బెదిరిస్తున్నాడు.  అందుకే 2014 ఎన్నికల్లో కనుక ఓటమి పాలైతే ఆయన పార్టీని చాపచుట్టేసి పెద్దల సభకు చెక్కేస్తారన్న ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంటున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *