mt_logo

తెలంగాణ మీడియా పై ఏడుపు

By కట్టా శేఖర్ రెడ్డి

ఆడలేక మద్దెల ఓడు

ఆడలేక మద్దెల ఓడిందని చెప్పడం అసమర్థులు చేసే వాదన. కాంగ్రెస్ కేసులు, ఫిర్యాదుల మీద పనిచేసినంతగా జనంలో పనిచేస్తే బాగుండేది. కోర్టుల చుట్టూ, ఎన్నికల కమిషన్ చుట్టూ తిరిగినంతగా ఓటరు చుట్టూ తిరిగితే ఎంతో కొంత ప్రయోజనం ఉండేది. ఏదోఒక విధానం, దృక్పథం ఉన్నవాళ్లు కేసులపై, ఫిర్యాదులపై ఆధారపడరు. ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో, ఎలా నమ్మించాలో అర్థంకాని వాళ్లే ఎక్కువ యాగీ చేస్తుంటారు. కాంగ్రెస్, మహాకూటమి గోల అందులో భాగమే. టీ న్యూస్ చానెల్, నమస్తే తెలంగాణ పత్రిక తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, టీఆర్‌ఎస్‌కు కరపత్రాల్లా పనిచేస్తున్నాయని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రా ఆధిపత్యవాదానికి పుట్టిన పత్రికలు, చానెళ్లు కాంగ్రెస్ నాయకుల పత్రికా సమావేశాలను జరిగినంతసేపు ఎందుకు లైవ్ ఇస్తున్నాయో చెప్పగలరా? వారు ఏ ప్రయోజనం ఆశించి కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారు? ఇదే కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో పదవులు వెలగబెడుతున్నప్పుడు సాక్షి టీవీ, పత్రిక రెండూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన కుట్రలు, కథనాలు తెలంగాణ ప్రజలు అప్పుడే మర్చిపోతారా? అప్పుడు ఈ జానారెడ్డి, ఈ ఉత్తముడు, ఈ కోమటిరెడ్డి ఎవరి సేవల్లో తరించారో అందరికీ గుర్తే. చంద్రబాబు ఎన్నిదుర్మార్గాలు చేసినా, తెలంగాణకు ఎన్ని ద్రోహాలు చేసినా, తెలంగాణకు ఆయనకు సంబంధం లేకున్నా ఆయన వార్తలను పతాక శీర్షికలకు ఎక్కించే పత్రికలు, ఆయన తుమ్మినా దగ్గినా లైవ్‌లు పెట్టే చానెళ్లు తెలంగాణ ప్రజలందరికీ ఎరుకే. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి, తెలంగాణ అభివృద్ధి పథానికి, తెలంగాణ రాజకీయశక్తికి ఇప్పుడొక పత్రిక, చానెల్ అండగా ఉండటం వీరెవరికీ జీర్ణం కావడం లేదు. వీళ్లంతా పెద్ద గురివిందలు. తెలంగాణకు ఏది మంచో నమస్తే తెలంగాణ అదే ఆచరిస్తూ ఉన్నది. కాంగ్రెస్ తెలంగాణ అనుకూల నిర్ణయం చేసిన రోజున సోనియాను పతాక శీర్షికలో పెట్టుకున్నది నమస్తే తెలంగాణనే. కాంగ్రెస్ నాయకత్వం తన చేతగానితనాన్ని, జనాన్ని మెప్పించలేని తమ అసమర్థతను ఇతర కారణాలపైకి మళ్లిస్తున్నది. అందులో భాగమే తెలంగాణ మీడియా పై ఏడుపు.

కాంగ్రెస్ సమస్య విశ్వసనీయత లేకపోవడం. ఆ పార్టీ చరిత్ర, వర్తమానం అంతా ప్రజలకు గుర్తున్నది. ఇప్పుడు పది లక్షలు రుణమాఫీ చేస్తామంటే కూడా నమ్మేవాళ్లు లేరు. విశ్వసనీయతను సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. ఒకసారి పోతే తిరిగి సంపాదించడం కష్టం. కాంగ్రెస్ అనేక దశాబ్దాలుగా రైతు వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక విధానాలను అమలుచేసింది. ఆర్థిక సంస్కరణల జెండాను భుజానేసుకొని ప్రజల గోళ్లూడగొట్టే ఘనకార్యాన్ని అమలు చేస్తూ వచ్చింది. అప్పుడెప్పుడో దేవీలాల్ కాలంలో పదివేల రూపాయల రుణమాఫీ తప్పితే ఎప్పుడూ ఏ పార్టీ రుణమాఫీ చేయలేదు. మళ్లీ టీఆర్‌ఎస్ ఒక్కటే లక్ష రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చి, అమలుచేసి చూపించింది. మళ్లీ కూడా రుణమాఫీ చేయడానికి ముందుకు వచ్చింది. చేయగలిగింది చెప్పడం, అమలుచేయడం విశ్వసనీయత. టీఆర్‌ఎస్‌కు ఆ విశ్వసనీయత ఉంది. కాంగ్రెస్‌కు అదిప్పట్లో వచ్చే అవకాశమే లేదు. టీఆర్‌ఎస్ హామీ అంటే కేసీఆర్ హామీ. కేసీఆర్ హామీ ఇస్తే అమలవుతుంది. అందుకు రుజువులున్నాయి. కాంగ్రెస్ హామీ అంటే ఎవరి హామీ? ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దా? జానారెడ్డిదా? రేవంత్‌రెడ్డిదా? లేక వీరి ఢిల్లీ బాస్ రాహుల్ గాంధీదా? రాహుల్ గాంధీ హామీ అయితే దేశవ్యాప్తంగా చేస్తారా? కాంగ్రెస్‌ది బహునాయకత్వం, దేశమంతటి సమస్య. టీఆర్‌ఎస్‌ది తెలంగాణకు మాత్రమే పరిమితమైన అంశం. కేసీఆర్ ఒక్కరు చేయగలిగిన పని. ఢిల్లీ కోసమో, అధిష్ఠానం కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. కాంగ్రెస్, టీడీపీలు ఆంధ్రలో కూడా ఉన్న పార్టీలు. టీడీపీకి ఆంధ్రే ముఖ్యం. అక్కడ అధికారంలో ఉన్నది. మళ్లీ రావాలనుకుంటుంది. ఆంధ్ర ప్రయోజనాలు చూస్తుందా? తెలంగాణ ప్రయోజనాలు చూస్తుందా? నిజానికి చాలా చిన్న లాజిక్ ఇది.

ఉదాహరణకు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సంగతే చూడండి. రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 2005లో అప్పుడున్న 11000 క్యూసెక్కులు కాకుండా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచుతున్నప్పుడు తెలంగాణవాదులు అభ్యంతర పెట్టారు. కాంగ్రెస్‌లో ఉండికూడా పి.జనార్దన్‌రెడ్డి గట్టిగా వ్యతిరేకించాడు. అందుకాయనను ఎంత వేధించారో, ఆయన ఎలా గుండెపగిలి మరణించారో హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు. రాయలసీమకు తీసుకెళ్లేవి వరదనీళ్లే, నికర జలాలు కాదు, శ్రీశైలానికి వరద వచ్చేది 30 రోజులపాటే, ఆ 30 రోజుల్లోనే గరిష్ఠంగా నీళ్లు తీసుకోవాలంటే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాల్సిందే అని వాదించాడు రాజశేఖర్‌రెడ్డి. ఇప్పుడు చూడండి శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులకు నీరు చేరుకున్ననాటి నుంచి, అంటే జులై 24 నుంచి ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడులో నిరంతరాయంగా నీరు పారుతూనే ఉన్నది. అక్కడ టెలిమెట్రీలు ఉండవు. ఉన్నా పనిచేయవు. ఇవి కాకుండా హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు. ఇప్పుడు కొత్తగా నాగలదిన్నె… వరుసగా కృష్ణా నీటిని తోడేసేందుకు చంద్రబాబు నిరంతరం కుట్ర చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీశైలం నీటిపై కేవలం 30 టీఎంసీల హక్కు మాత్రమే కలిగిన రాయలసీమకు 130 టీఎంసీలు తరలించుకుపోయారు. అన్ని హక్కులున్న తెలంగాణ ఇప్పటివరకు కేవలం 30 టీఎంసీలే వాడుకోగలిగింది. మరి తెలంగాణలో ఆయనతో పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్, సీపీఐ, జనసమితి ఒక్క సందర్భంలోనైనా ఈ సమస్య గురించి మాట్లాడారా? అసలు మాట్లాడగలరా? ఎంతకడిగినా టీడీపీకి అంటిన తెలంగాణ ద్రోహ గుణం పోదు. ఆంధ్రా పక్షపాతంగా ఉండటం టీడీపీకి సహజ అవసరం కూడా. ఎటొచ్చీ తెలంగాణ పార్టీలే అసహజంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్, జనసమితి, సీపీఐలలో ఏ మాత్రం తెలంగాణ స్ఫూర్తి గానీ, ఆత్మగౌరవం కానీ లేవు. ఉంటే టీడీపీతో జతకలిసేవి కావు. ఆ పార్టీలు ఇప్పటికీ ఇతరేతర అవసరాలతో రాజకీయాలు చేస్తున్నాయే తప్ప, తెలంగాణ స్ఫూర్తితో కాదు. ఆ కూటమికి అరిష్టం అదే. కేవలం కేసీఆర్‌ను గద్దెదించాలనే లక్ష్యంతో అసహజ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.

మొన్న చంద్రబాబు హైదరాబాద్ వచ్చి తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారట. ప్రచారానికి కూడా వస్తారట. నిజమే.. బాబు రావాలి. ప్రచారం చేయాలని చాలామంది తెలంగాణ వాదులు కోరుకుంటున్నారు. అప్పుడైనా ఆయనతో కలిసి తిరిగిన వారికి బుద్ధి వస్తుందేమోనని వారి ఆశ. అదే రోజు టీడీపీ పెద్ద మనిషి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తెలంగాణకు చేసిన మేలు గురించి, హైదరాబాద్ నిర్మాణానికి ఆయన పాటుపడిన తీరు గురించి, చంద్రబాబు మహోన్నత వ్యక్తిత్వం గురించి చాలా భక్తిభావంతో, తన్మయత్వంతో వివరించారు. తెలంగాణ శతాబ్దాల తరబడి పరాయిపాలనలో, దశాబ్దాల తరబడి పొరుగు నేతల పాలనలో ఎందుకు ఉన్నదో ఆ నాయకుడిని చూసినప్పుడు అర్థమైంది. సొంత వ్యక్తిత్వంగానీ, ఆత్మాభిమానంగానీ, అస్తిత్వ చైతన్యం గానీ లేని జాతి ఇతర జాతులకు అణిగిమణిగి ఉంటుందని సామాజిక సూత్రం. ఇప్పటికీ చంద్రబాబు నామస్మరణ చేసేవారు కొందరు తెలంగాణ లో ఉన్నారంటే తరతరాల బానిస వారసత్వ లక్షణాలే ఇంకా కొనసాగుతున్నాయనిపిస్తుంది. వీరు ఇంకెంత మాత్రం రాజకీయంగా తెలంగాణకు ఉపయోగపడరు. వీరిని తెలంగాణ ప్రజలే వదిలించుకోవలసి ఉన్నది. వీరితో జతకలసిన కాంగ్రెస్, జనసమితి, సీపీఐలకూ ప్రజలు తగిన స్థానం చూపించవలసి ఉంది. శిఖండి భీష్ముడిని నిరాయుధున్ని చేసినట్టు, చంద్రబాబు కూటమిని నిరాయుధం చేశాడు. కూటమి పతనానికి అది చాలు.

Source: kattashekar.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *