వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పదహారు స్థానాల్లో విజయం సాధిస్తుందని, సర్వేలన్నీ టీఆర్ఎస్ గెలుపును స్పష్టంగా చెప్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమవేశం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంగళవారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఏప్రిల్ 11న జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో రెండుమూడు లక్షల భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా కృషిచేయాలని, దీనికి ప్రధాన బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలే తీసుకోవాలని సూచించారు.
ఈనెల 17న కరీంనగర్ లో, 19న నిజామాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కనీసం రెండు లక్షల మందికి తక్కువ కాకుండా సభ జరగాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అభ్యర్థులు ఎవరని చూడకుండా ప్రతి ఒక్క అభ్యర్థి గెలిచేవిధంగా చూడాలని, రెండు మూడు రోజుల్లో పార్టీ అభ్యర్ధులను ప్రకటించుకుందామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్తున్నాయని, పార్టీ పరంగా చేయించిన సర్వేల్లోనూ ఇదే తేలిందని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే అన్ని సీట్లలో మనమే గెలుస్తున్నామనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు. భారీ మెజార్టీ సాధించే దిశగా ప్రతిఒక్కరు కృషి చేయాలని సీఎం పేర్కొన్నారు.