సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ తో కెనడా కాన్సులేట్ జనరల్ నికోల్ గిరార్డ్ సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడం పట్ల గిరార్డ్ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగున్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం అనేక రంగాల్లో సాధించిన అభివృద్ధిని కేటీఆర్ ఈ సందర్భంగా నికోల్ కు వివరించారు. అంతకుముందులానే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయరంగ ప్రగతి కోసం వినూత్నమైన ప్రణాళికలు, పథకాలు కొనసాగిస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతులకు భరోసాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ పథకాలైన రైతుబంధు, రైతు భీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యకమాలపై నికోల్ ప్రశంసలు కురిపించారు. కెనడా, భారత్ కు సంబంధించిన వ్యాపార, వాణిజ్య సహకారానికి సంబంధించి ఇరువురి మధ్య చర్చకురాగా కెనడా ప్రభుత్వం ఇక్కడి రాష్ట్రాలతో నేరుగా చర్చలు జరిపితే వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతాయని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని కేటీఆర్ వివరించారు.